Saturday, 7 August 2021

విగ్రహారాధనద్వేషులు దేవాలయాలకు దూరంగా ఉండండి


 

అయ్యో, సాములూ, అరకొరజ్ఞానంతో పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం జపించడం మానండి.

నిజమే. అలౌకికంగా చూస్తే తన భక్తులను స్వామివారే రప్పించుకుంటారు, ఆయన వద్దనుకుంటే దర్శనం ఎంత ప్రయత్నించినా వీలుకాదు. మేము కాదనటం లేదు.

అందువల్ల, వద్దనడానికి వారెవరు వీరెవరు అంటూ మీరు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

మా సమాధానమేమిటంటే, స్వామివారు తిరుమలలో విగ్రహరూపంలో వెలిశారు. అక్కడ విగ్రహారాధనను వ్యతిరేకించేవారికి అధికారికంగా ఎందుకు ప్రవేశం ఇవ్వాలి?

“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” –

సమస్త ధర్మాలను విడిచిపెట్టి నామీద అచంచలమైన విశ్వాసంతో నన్ను శరణు కోరు – అని స్వామివారు స్పష్టంగా భగవద్గీతలో (18.66) చెప్పి ఉన్నారు. మరి అటువంటి అచంచలమైన విశ్వాసం లేకపోతే ఎందుకు దర్శనానికి పోవడం?

పైగా స్వయంగా స్వామివారే సెలవిచ్చారు -

“యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్” –

నన్ను ఎవరు ఏ విధంగా (విగ్రహరూపంలో కావచ్చు, రూపరహితంగా కావచ్చు) కొలిస్తే వారిని నేను అదే విధంగా అనుగ్రహిస్తాను (గీత 4.11) అని స్పష్టంగా చెప్పి ఉన్నారు.

కాబట్టి, అందరూ తమ తమ ఇష్టదేవతలలో కొలిచేది ఆ స్వామివారినే. విగ్రహారాధనలో నమ్మకం లేనివారు విగ్రహాలు ఉండని తమ తమ ప్రార్థనాస్థలాలకు వెళ్లి స్వామివారిని ప్రార్థించుకోవచ్చు. వారు అక్కడ ప్రార్థన చేసినప్పటికీ కూడా వారిని స్వామివారు అనుగ్రహిస్తారు.

సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి.
ఏ దేవుడికి ఎటువంటి నమస్కారం చేసినా, ఎటువంటి ప్రార్థన చేసినా, ఎక్కడ చేసినా, అవన్నీ చేరేది స్వామివారికే.

అందువల్ల, సంపూర్ణమైన విశ్వాసంతో దివ్యమంగళవిగ్రహరూపంలో స్వామివారిని చూడదలచిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలి.

అంతేగాని, నాకు విగ్రహారాధనమీద నమ్మకం లేదు, విగ్రహారాధన మా మతంలో పాపం అని ఒకపక్క మనసులో భావిస్తూ, అయినా సరే హిందువులందరూ గొప్పగా కొలిచే ఆ విగ్రహం ఎలా ఉందో చూసొద్దాం అని ఒక చార్మినార్ ను చూడటానికి, ఒక సాలార్ జంగ్ మ్యూజియంను చూడటానికి, ఒక తాజ్ మహల్ ను చూడటానికి వచ్చినట్టు తిరుమల స్వామిని కూడా చూడటానికి కూడా ఎవరైనా రావచ్చు అనే ఊహ కూడా మాకు కంపరం పుట్టిస్తోంది. అలా వచ్చేవారికి టికెట్లమ్మి సొమ్ము చేసుకోవడానికి మీకు తొందర ఉండవచ్చు. కాని, స్వామివారు జూలో జంతువు కాదు, కాసేపు వినోదంగా చూసి పోవడానికి.

తమరు మరింత దూరం పోయి వ్యర్థపాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

“త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః” – (నీలోనూ నాలోనూ వేరొకచోట కూడా ఉన్నది విష్ణువే కదా, నన్ను సహించలేక వ్యర్థంగా కోపిస్తున్నావు) – అని శంకరాచార్యులవారు అనలేదా అని “కోట్” చేస్తున్నారు.

నిజమే. మీ ప్రశ్నకు సమాధానం కూడా శంకరులవారు తమ మాటలలోనే ఇమిడ్చి ఉన్నారు గ్రహించండి.

అన్యత్ర – అంటే వేరొక చోట (అంటే విగ్రహరహితమైన వారి వారి ప్రార్థనాస్థలాలలో ఉన్నది కూడా) ఏకో విష్ణుః - అదే విష్ణువు ఉన్నాడని స్పష్టంగా చెప్పారు కదా?

మరి అక్కడ వారు స్వామివారిని నిర్గుణంగా నిరాకారునిగా మనసులో భావించి ప్రార్థనలు చేసుకోమనండి, ఎవరు వద్దన్నారు? అంతేగాని, విగ్రహరూపాలను విశ్వసించని ఆ అన్యమతస్థులకు తిరుమలలో విగ్రహరూపంలో ఉన్న స్వామివారిని చూపించాలని మీ పట్టుదల ఏమిటి? ఎందుకు మీరు అసహిష్ణుతతో ప్రవర్తిస్తున్నారు?

అన్యమతస్థులలో కూడా కొందరికి విగ్రహరూపంలో ఉన్న స్వామివారి పట్ల అచంచల భక్తి ఉండవచ్చు. వారు ఎప్పట్నుంచో స్వేచ్ఛగా వచ్చి దర్శించుకొని పోతూ ఉన్నారు. సంతోషమే, వారిని ఇప్పటివరకూ ఎవరు అడ్డగించారు? ఎవరు పోపొమ్మన్నారు? అంతా సవ్యంగా జరుగుతోంది కదా? మరెందుకు ఇప్పుడూ ఈ అవాకులు చవాకులు?

ఇంతవరకూ హిందువులకు మతాంతరసహిష్ణుత లేనట్లు గాను, ఆ లేనిదేదో మీరు హిందువులకు బోధిస్తున్నట్లుగాను, హిందూమతంలో ఏవో సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్టుగాను, హిందువులను ఉద్ధరిస్తున్నట్టుగాను ఒక ఇష్యూ ఎందుకు సృష్టించారు?

)))(((
పాపం మరికొందరు ఉన్నారు.
ముస్లిం రాజులు, బ్రిటిష్ రాజులూ హిందుత్వాన్ని ఏమీ చేయలేకపోయారు. ఇప్పటి వాళ్లు ఏదో చేసేస్తారని భయపడటం అనవసరం అని భావిస్తున్నారు.

అయ్యా సామీ, చరిత్ర అంటే మొగల్ రాజదర్బారులు, వారి వైభవమూ మాత్రమే కాదు. పాఠ్యపుస్తకాలలో ఉన్నది మాత్రమే పరీక్షలకోసం బట్టీ పట్టి చదివి, నాకు చరిత్ర కొట్టినపిండి అని భావించకండి.

అప్పట్లో కూడా హిందుత్వంపై దాడులను అడ్డుకొనేందుకు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడిన వీరులు ఉన్నారు. అసంఖ్యాకులైన హిందువులు అసువులు వీడారు. వారి త్యాగాల ఫలితంగానే ఇప్పుడు మీరైనా నేనైనా ఇంకా హిందువులుగానే మిగిలివున్నాం. అది ముందుగా గుర్తించండి. వారిని కూడా మహాలయపక్షంలో తలచుకోండి. అది మన ధర్మం.

)))(((
హిందుత్వం అనేది నేను కాపాడటానికి పూనుకోనంత మాత్రాన నిలబడదా? అంత చేవ చచ్చిందా? నీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఆ దేవుడే తనను తాను కాపాడుకుంటాడు. అయినా, నన్ను దేవుడు కాపాడాలి కాని, నేను దేవుడిని కాపాడటమేమిటి? అని మరికొందరు పాపం, చాల చాల “అమాయికంగా” అడుగుతున్నారు.

ముందుగా - నేను దేవుడిని కాపాడలేను మీరు అని నిజాయితీగా ఒప్పుకున్నందుకు అభినందనలు. అది నిజం. దేవుడిని కాపాడటానికి మీరే కాదు, మేము కూడా అశక్తులమే. స్వయంగా దేవుడే ఎంతవరకు అవసరమో, ఏ విధంగా కోరుకుంటాడో అంతవరకు తనను తాను కాపాడుకుంటాడు. మాలాంటివారం కేవలం పరికరాలం మాత్రమే. మా దేవుడిని మా ధర్మాన్ని కాపాడుకోవాలనే బుద్ధిని మాకు పుట్టించి మా ద్వారా దేవుడే తనను తాను కాపాడుకుంటాడు.

అది కేవలం మా విశ్వాసం కాదు, స్వయంగా మహాభారతకర్త అయిన వ్యాసమహర్షులవారి మాట. ఉద్యోగపర్వంలోని ప్రజాగరపర్వాన్ని వెదకండి. ఈ శ్లోకం కనిపిస్తుంది.

న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్।
యం తు రక్షితుమిచ్ఛంతి, బుద్ధ్యా సంవిభజంతి తమ్।।

(దేవతలు ఎవరినైనా కాపాడాలి అనుకుంటే గోపాలకుడిలాగా కర్ర పట్టుకుని కాపలా కాయరు. వారికి కాస్త బుద్ధిని ప్రసాదిస్తారు.)

నిజానికి రావణాసురుడిని చంపడానికి విష్ణువు రామావతారం ఎత్తవలసిన పని లేదు. తాను ఉన్న వైకుంఠంనుండే సంకల్పమాత్రంతో చంపగలడు.

కాని, ఆయన ప్రజలకు అధర్మం మీద పోరాటం చేసే విధానాన్ని నేర్పదలచుకున్నాడు. అందువల్లనే రామునిగా అవతారం దాల్చాడు.

నిష్కారణవైరం ఉండరాదని చెప్పదలచుకున్నాడు కాబట్టి అయోధ్యనుండి నేరుగా రావణాసురుడిమీదకు దండయాత్రకు పోలేదు. సీతాపహరణం చేసి తనకు అపకారం చేశాడు కాబట్టే రావణాసురుడితో శత్రుత్వం కలిగింది. అయినా సరే, రాముడు చాల సహనంతో మన మధ్య శత్రుత్వం వద్దు అని రావణాసురుడితో ఎన్నో రాయబారాలు కూడా చేశాడు. అయినా రావణాసురుడు మూర్ఖంగా మొండికేశాడు. అందువల్లనే అతడిని వధించడం తప్పనిసరి అయింది. ఇందులో రాముని తప్పేమీ లేదు.

రామావతారంలో కూడా, సీతను అపహరించింది రావణుడు అని జటాయువు చెప్పగానే రాముడు అదే ప్రాంతంనుండి ఒక్క బాణం విడిచి రావణాసురుడి పది తలకాయలను తెంచగల శక్తి ఉన్నవాడే.

అయినప్పటికీ, అధర్మాన్ని ఎదిరించేందుకు ఎటువంటి సంఘటితశక్తి కావాలో తరతరాల ప్రజలకు ఆయన పాఠం చెప్పదలచుకున్నాడు కాబట్టే వానరుల సాయం కోరాడు. ధర్మాన్ని కాపాడడం ఒక్కని బాధ్యత కాదని, అందరి బాధ్యత అని ఆయన నిరూపించదలచుకున్నాడు. ఉడుత చేసిన సాయాన్ని కూడా ఎంతో ఆదరంగా స్వీకరించాడు. ధర్మాన్ని కాపాడుకునే కర్తవ్యంలో అందరికీ భాగస్వామ్యం పొందే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని స్వీకరించిన వానరాలు ధన్యులయ్యారు. రాముని నాయకత్వంలో విజయాన్ని పొందారు.

వానరులు లేకపోతే రాముడు నిస్సహాయుడు అని భావిస్తే అది సంపూర్ణంగా మన అజ్ఞానం.

ఆ విధంగా ధర్మాన్ని కాపాడుకునేందుకు దేవుడు ప్రతిసారీ, తన భక్తులు కూడా భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ప్రసాదిస్తాడు. (ప్రసాదమంటే కేవలం లడ్డు పులిహోరలు మాత్రమే కాదని మనవి.) 

ఆ సమయంలో మనం భాగస్వాములు కావడానికి నిరాకరించి, దేవుడు తనను తాను కాపాడుకోలేడా అని వెక్కిరింపులు ఈసడింపులు చేయడం చాల సులువైన, సౌకర్యవంతమైన పని.

కాని, మమ్మల్ని పరికరాలుగా చేసుకుని దేవుడు ధర్మరక్షణకార్యం నిర్వర్తిస్తాడు అనేది మా విశ్వాసం.

అర్జునుడు కూడా, నన్ను చంపవచ్చిన కౌరవులు అధర్మపరులైనప్పటికీ నేను మాత్రం వీరిని చంపను అని కృష్ణుడితో అన్నాడు.

“ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన” (గీత 1.35)

అందుకు కృష్ణుడు నవ్వి, చాల్లేవయ్యా, పెద్ద పండితుడిలాగా చెప్పొచ్చావ్. ఎవరిని గూర్చి ఏడవనవసరం లేదో, వారిని గూర్చి ఏడుస్తున్నావ్.

“అశోచ్యానన్వశోచస్త్వం, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే” (గీత.2.11) అన్నాడు.

ఈ ధర్మవిరోధులను నేను చంపబోతాను అనుకొనడం నీ భ్రమ. కాలస్వరూపుడనైన నేనే ఈ ధర్మవిరోధులను సంహరించడానికి పూనుకుని ఉన్నాను. యుద్ధం ద్వారా ధర్మరక్షణ చేయడానికి నీకు అవకాశం ఇచ్చాను. ఆ అవకాశాన్ని వినియోగించుకుని కీర్తిని పొందు. కేవలం నాకు పరికరంగా ఉండు. నువ్వు లేనంతమాత్రాన నా సంకల్పం నెరవేరదని భావించకు.

(ఋతే త్వాం న భవిష్యన్తి సర్వే – తస్మాత్ త్వముత్తిష్ఠ, యశో లభస్వ – నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్) – (గీత – విశ్వరూపసందర్శనయోగం – 32,33)

అయ్యా సామీ, ఆ విధంగా,
మేమే చేస్తున్నాం, మేమే దేవుడిని కాపాడగలం, మేమే హిందుత్వాన్ని కాపాడగలం అనే అజ్ఞానంలో మేము లేము. మేము ఆ భగవంతుని పరికరాలం అనే విశ్వాసం మాత్రమే మాది. భగవంతుడు ఆదేశించినట్టుగా మేము నిమిత్తమాత్రంగా ఉంటాము. మాకు కీర్తి రావచ్చు, లేదా మేము అపకీర్తి పాలు కావచ్చు.

మీకు అటువంటి విశ్వాసం లేదనుకుంటే అది మీ యిష్టం. మీకు, మీలాంటి వారికి శుభమస్తు.

)))(((
ఇంకా చెప్పడం పూర్తి కాలేదు. వ్యాసం పేరు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. మరి ఆ విషయం చెప్పకుండా పూర్తి చేస్తే ఎలా?

ప్రతివిషయానికీ ఒక అధికారి అనేవాడు ఉంటాడు. ఈ సందర్భంలో అధికారి అంటే పెత్తనం చలాయించేవాడు అని కాదు అర్థం. ఇక్కడ అధికారి అంటే అర్హుడు, యోగ్యుడు, తగినవాడు అని అర్ధం. ఇప్పట్లో అయోగ్యులు అధికారులౌతూ ఉండటం వల్ల ఆ పదానికి అసలైన అర్థం మనం మరచిపోయాం.

ఒకటవ తరగతి పిల్లవాడికి క్వాంటం థియరీ బోధిస్తారా?
ఆ విషయానికి ఆ పిల్లవాడు అధికారి కాదు.

అలాగే
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒకటి నుండి వంద వరకు అంకెలు మాత్రమే సిలబస్ అని చెబుతారా? ఇతడు కూడా ఆ సిలబస్ కు అధికారి కాడు.

అదేవిధంగా,
సత్త్వరజస్తమోగుణాలు కలిగినవారికోసం బట్టి ఆయా గుణాలకు అనుగుణంగా విడివిడిగా కర్తవ్యధర్మోపదేశాలు చేయబడ్డాయి. అలాగే వివిధ ఆశ్రమాలలో (బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్థ-సన్న్యాస ఆశ్రమాలు) ఉండేవారికోసం వివిధధర్మాలు ఉపదేశింపబడ్డాయి. ఆయా ధర్మాలకు వారే అధికారులు.

సన్న్యాసాశ్రమంలో ఉండే వారు పాటించవలసిన నిష్కర్మ (భగవద్ధ్యానం తప్ప ఏ పనిమీద ఆసక్తి చూపవద్దు. అంతా భగవంతుడే చూసుకుంటాడు) అనే ధర్మాన్ని పట్టుకు వచ్చి మిగిలిన ఆశ్రమాలలో ఉండే ప్రజలకు (ఉదాహరణకు - విద్యార్థులకు, గృహస్థులకు, ఉద్యోగులకు, సైనికులకు) బోధించి, మీరు భగవద్ధ్యానం చేసుకోండి, అంతా భగవంతుడే చూసుకుంటాడు అని అసందర్భంగా “కోట్” చేసి, వారిలో అయోమయం సృష్టించడం సంపూర్ణమూర్ఖలక్షణమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

పోనీ, మీరే కరెక్టు అనుకుందాం. మరి భగవంతుడిమీద అంతటి నమ్మకం ఉన్న మీరు భగవద్ధ్యానం చేసుకొనడం మానేసి, మీ నాయకుడి నిర్ణయాలు మంచివైనా చెడ్డవైనా అవి మీ నాయకుడి అభీష్టాలు కాబట్టి, గుడ్డిగా వెనకేసుకుని రావడం, మామీద మాటల యుద్ధం చేయడం ఇవన్నీ ఏమిటి?

మీరు కోట్ చేసిన శ్లోకసారాంశం మీద మీకే నమ్మకం లేదు. మీరే పాటించటం లేదు. మరి మాకెందుకు బోధిస్తున్నారు? మీకు మీ నాయకుడు ఎంతో కావచ్చు., మాకు మా ధర్మం అంతకంటె ముఖ్యం.

కొంగ ఎంత తెల్లగా ఉన్నా, ధ్యానం చేస్తున్నట్టు ఎంత నిశ్చలంగా కనిపించినా, దాని ధ్యేయం మాత్రం చేపలు పట్టడమే. కాదని మీరు ఎంత దబాయించినా లోకం తెలుసుకోలేదా యేం? 

Earlier, posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3267410146712976


విశ్వామిత్రుడు యజ్ఞం ఎందుకు చేసినట్టు?

 విశ్వామిత్రమహర్షులవారు అయోధ్యకు వేంచేశారు. దశరథమహారాజు ఎదురేగి ఆయనకు స్వాగతం పలికాడు. “మహర్షీ, మీ రాక మాకు ఎడారిలో వర్షం కురిసినంత ఆనందం కలిగించింది. మీరు ఏమి కోరి వచ్చారో తెలుపవలసింది. మీ పని నెరవేరుతుందో లేదోనని బెంగ పెట్టుకొనవద్దు. కర్తా చాహమశేషేణ - మీ పనులు నేను సంపూర్ణంగా నెరవేర్చి పెడతాను”. అని వినమ్రుడై పలికాడు.

"దశరథమహారాజా, నేనొక యజ్ఞం చేస్తున్నానయ్యా. దానికి కామరూపులైన ఇద్దరు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని అడ్డుకుని శిక్షించాలి. నీ కుమారుడైన రాముని నాతో పంపవయ్యా" అని విశ్వామిత్రుడు అడిగాడు.

దశరథుడు భయపడ్డాడు. “ఉహుహు. నా రాముడు పసివాడు. రాజీవలోచనుడు. రాక్షసులతో యుద్ధం చేయలేడు. నా అక్షౌహిణీసైన్యంతో నేనే వచ్చి పోరాడుతాను. బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్త్రకమ్. రాముణ్ణి నేను పంపను.”

"ఏమయ్యా, పని చేసి పెడతానని మొదట వాగ్దానం ఇప్పుడు మాట తప్పుతున్నావ్? సరే, సుఖంగా ఉండు. వెళ్లి వస్తా" అంటూ విశ్వామిత్రుడు అలిగేసరికి అందరూ భయపడ్డారు.

వసిష్ఠమహర్షి కలుగజేసుకుని నచ్చజెప్పాడు. చివరకు దశరథుడు ఒప్పుకున్నాడు. విశ్వామిత్రునికి రామునితో పాటు లక్ష్మణుని కూడా అప్పజెప్పాడు. గురుశిష్యులు ప్రయాణమైనారు. విశ్వామిత్రుడు వారికి బల అతిబల మంత్రాలనిచ్చాడు. వాటి ప్రభావం వలన వారికి అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాక్షసులు వారిని దొంగదెబ్బ తీయలేరు.

దారిలో గంగానదీతీరాన వారు ఒకనాడు ధనధాన్యాలతో తులతూగి, తాటక అనే ఘోరరాక్షసి పీడవలన భయంకరారణ్యంగా మారిన మలదకరూశప్రాంతాలను చూశారు. ఆమెచేత చంపబడిన వారు చంపబడగా, మిగిలిన జనాలు ఆ దేశాన్ని వదిలి పారిపోయారు.

"రామా, అయ్యో స్త్రీ కదా అని జాలిపడకుండా క్రూరురాలైన ఆమెను నీవు సంహరించి, ప్రజలకు రక్షణ చేకూర్చాలయ్యా. రాజ్యభారనియుక్తానామ్ ఏష ధర్మః సనాతనః. రాజ్యభారాన్ని వహించేవారికి ఇది సనాతనమైన ధర్మం" అని విశ్వామిత్రుడు హితం చెప్పాడు.

రామలక్ష్మణులు తాటకను వధించారు. విశ్వామిత్రుడు సంతోషించి రామునికి అనేకమైన దివ్యాస్త్రాలను, వాటి ఉపసంహారమంత్రాలతో సహా ఉపదేశించాడు.
రాముడు వాటిని సంగ్రహించి, మహర్షులవారి ఆనతిపై వాటిని లక్ష్మణునికి తాను స్వయంగా ఉపదేశించాడు.

అన్నదమ్ముల రక్షణలో విశ్వామిత్రుని యాగం నిర్విఘ్నంగా జరిగింది. తాటక కుమారుడైన మారీచుని దూరంగా పడగొట్టారు. అతడి జతగాడైన సుబాహుని హతమార్చారు.

యజ్ఞపరిసమాప్తితో దిక్కులన్నిటా ఈతిబాధలు తొలగిపోయాయి. అథ యజ్ఞసమాప్తే తు విశ్వామిత్రో మహామునిః నిరీతికా దిశో దృష్ట్వా... అని వాల్మీకి వర్ణించాడు.

అంటే, విశ్వామిత్రుడు స్వార్థం కోసమో స్వర్గమో మరొకటో కోరి యజ్ఞం చేయలేదు. ఈతిబాధలను తొలగించటానికి యజ్ఞం చేశాడు. ఏమిటా ఈతిబాధలు?

శ్లో “అతివృష్టి రనావృష్టి ర్మూషకా శ్శలభాః ఖగాః.
అత్యాసన్నాశ్చరాజానః షడేతా ఈతయ స్స్మృతాః"

ఈతిబాధలు ఆరు రకాలు. 1అతివృష్టి 2అనావృష్టి 3మూషకాలు, 4శలభాలు, 5పక్షులు, 6రాజుగారికి అతి అభిమానులు. వీటివలన ప్రజలు పడే బాధలు ఇంతింతనరానివి. అందువలన వాటిని తొలగించదలచి విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు.

1 అతివృష్టి అంటే అవసరమైనదానికన్న ఎక్కువ వర్షం కురియడం.

2 అనావృష్టి అంటే అవసరమైనదానికన్న తక్కువ వర్షం కురియడం.

3 పంటలను సర్వనాశనం చేసేంతగా ఎలుకల సంతతి పెరగడం.

4 పంటలను సర్వనాశనం చేసేంతగా మిడతలదండ్లు దాడి చేయడం.

5 పంటలను సర్వనాశనం చేసేంతగా పక్షులసంతతి పెరగడం.

6 అతి సమీపంలో ఉన్న పాలకులు (మా రాజుదే రాజ్యమని సామాన్యప్రజలను పీడించే ఆ రాజుగారి అనుచరుల ఆగడాలు అని అర్థం చేసుకొనవచ్చు.)




ఈ ఆరింటిని ఈతిబాధలంటారు. వాటిని అరికట్టడం కోసమే విశ్వామిత్రుని యజ్ఞం జరిగింది. అయితే విశ్వామిత్రుని ప్రవర్తనలో ఈనాటి సమాజానికి సరిపోయే మరికొన్ని అంశాలను మనం గమనించవలసి ఉంది.

పాతతరం మనుషులు (దశరథుని వంటివారు) ఎప్పుడూ ధర్మసంరక్షణకు ముందుకు వస్తారు. కాని, తమ సంతానాన్ని ధర్మరక్షణకు పంపేందుకు జంకుతున్నారు. అటువంటి జంకుగొంకులు మాని, క్రొత్తతరానికి ధర్మరక్షణబాధ్యతను అప్పగించవలసిన బాధ్యత వారికుంది.

ధర్మరక్షణబాధ్యతను మునులు స్వయంగా చేపట్టగలరు. కాని, యుద్ధం చేయటం మునుల ధర్మం కాదు. వారు యుద్ధం చేస్తుంటే భోగభాగ్యాలను అనుభవిస్తూ తింటూ కూర్చొనడం సమాజానికి సిగ్గుచేటు. అందువల్ల, మీ యుద్ధం మీరే చేయండి అని వారి కర్మకు వారిని వదిలిపెట్టకూడదు. వారిని రక్షించే బాధ్యతను క్షత్రియులు చేపట్టాలి.

అలాగని, మునులు అన్నిటినీ విడిచి ముక్కుమూసుకుని తపస్సును చేస్తూ కూర్చోరాదు. శక్తిమంతులైన క్షత్రియులను తయారుచేసి, వారికి తగిన అస్త్రశస్త్రసంపత్తిని చేకూర్చే బాధ్యత వారిదే.

ఈతిబాధలను తొలగించగల శాస్త్రపరిజ్ఞానాన్ని పెంపొందించుకొనే బాధ్యత మునులదే. వారి శాస్త్రపరిశోధనలకు, పరిశోధనాఫలితాలను సమాజానికి ఉపయోగపడేలా చూసే బాధ్యత క్షత్రియులది.

స్త్రీలు సమాజంలో రక్షార్హులు. నిజమే. కాని, ఆడవారిలో కూడా కొందరు పరమక్రూరురాళ్లుండే అవకాశముంది. కాని, వారు బలగర్వితులై ప్రజలను పీడిస్తూ ఉంటే అటువంటివారు కూడా తప్పక దండనార్హులే.

సుందుడు, తాటకాసుందుల కుమారుడైన మారీచుడు, వారితో బాటు సుబాహుడు రాక్షసరాజైన రావణాసురుని అనుచరులు. ప్రజలను పీడించడమే వారి పని. బహుశః ప్రజలను పీడించే ఈతిబాధలను సృష్టించడం కూడా వీరు పని గట్టుకుని చేస్తుంటారు. (నేటి బయో వార్ లా) సుందుని అగస్త్యముని సంహరించాడనే కోపంతో అతని భార్య అయిన తాటక కూడా జనాల మీద పగబట్టి పీడించడం మొదలుపెట్టింది. రాజుగారి అండ చూసుకుని పేట్రేగిపోయే ఈ విధమైన క్రూరులు కూడా ఈతులలోనికే వస్తారు.

విశ్వామిత్రుడు వారిని కూడా అణచేందుకు తగిన శిక్షణను రామలక్ష్మణులకు ఇచ్చాడు.

స్వచక్రం పరచక్రం చ సప్తైతా ఈతయః స్మృతాః అని కొందరంటారు.  స్వదేశంలో కలిగే బాధలు స్వచక్రం, బయటదేశపు పాలకులవలన కలిగేవి పరచక్రం అన్నమాట. అంటే పాకిస్థాన్, చైనా వంటి దేశాల దుందుడుకు చేష్టలు, ఉగ్రవాదచర్యలు వంటివి.

స్వచక్రాలను సాధ్యమైనంత త్వరగా అణచివేయాలి. పరచక్రాలను సరైన సమయం వచ్చేదాకా ఎదురు చూసి, సరైన మిత్రులను సమకూర్చుకుని చావుదెబ్బ కొట్టాలి.

అరణ్యవాసకాలంలోనే మునులు రామునికి రావణాసురుని అనుచరులవల్ల తమకు కలుగుతున్న బాధలను గూర్చి మొరపెట్టుకున్నారు. రాముడు తొందరపడలేదు. వారికి రక్షణ కల్పిస్తూ వచ్చాడే తప్ప వెంటనే రావణుని మీదకు దండెత్తి పోలేదు. దండెత్తటానికి సరైన కారణం దొరకగానే మొదట రావణాసురుని మిత్రుడైన వాలిని అణచివేసి, తనకు సంపూర్ణంగా సహకరించగల సుగ్రీవునితో స్నేహం చేసి అటుపిమ్మట దండయాత్ర చేసి రావణుని పూర్తిగా అణచివేశాడు.

అదీ రామునికి విశ్వామిత్రుడు నేర్పిన యుద్ధనీతి. ఆనాడు దశరథుడు చిన్నపిల్లవాడని రాముడిని పంపకుంటే, విశ్వామిత్రునికి తగిన శిష్యుడు దొరకకుంటే ఇప్పటికీ రావణరాజ్యం నడుస్తూ ఉండేదేమో.

ఇప్పుడు కూడా మన దేశానికి విశ్వామిత్రుల అవసరం ఉంది. తమ పుత్రులను విశ్వామిత్రుని శిష్యరికానికి పంపే దశరథమహారాజుల అవసరం ఉంది. విశ్వామిత్రయజ్ఞం అవసరమైనపుడల్లా జరిగితే గాని, ప్రపంచం సురక్షితంగా ఉండే అవకాశం లేదు. 

Previously posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2953553781431949

ఎవరు నింద్యులు?

 



అశోకుడు బాటల వెంబడి చెట్లను నాటించెను, అంటే అదో చరిత్రా అంటూ ఈసడించి పారేశాం. నాగరికత డిమాండ్లకు తలవొగ్గి విశాలమైన రోడ్లు అవసరమై దారికి అడ్డు వచ్చిన ప్రతి చిన్నాపెద్దా చెట్టును నిర్దయగా నరికిపారేస్తూ ఉంటే, మనం కనీసం పట్టించుకొనడం కూడా మానివేశాం.


అక్బరు ఫతేపూర్ సిక్రీని కట్టించెను, సలీం అనార్కలిని ప్రేమించెను, షాజహాను తాజమహలును కట్టించెను అంటే రకరకాల పరీక్షల్లో మార్కుల కోసం గుర్తు పెట్టుకుని వారు చాలా ఘనులు అనుకుంటాం. కాని, మన ప్రాంతాలలోనే ఫలానా జమీందారు లేదా ఫలానా పాలెగాడు బావులు త్రవ్వించెను, వాపీకూపతటాకాలు నిర్మించెను అని నిజమైన చరిత్రను చెప్పేవారు కూడా లేరు. మనకు సంబంధించి జమీందార్లు పాలెగాళ్లు దోపిడీదారులు ముఠానాయకులు మాత్రమే. వాళ్ల బూర్జువా గుర్తులు కూడా మిగలడానికి వీల్లేదు పూడ్చేయండిరా, ఆక్రమించండిరా అంటూ వాటిని దుంపనాశనం చేశాం.

ఫలానా శెట్టి ప్రయాణికులు తల దాచుకొనేందుకు తమ తల్లిదండ్రుల పేరిట సత్రాలు మండపాలు కట్టించెను అని ఎక్కడైనా వింటే కోటికి పడగలెత్తిన ఆ శెట్టి బీదవాళ్లను దోచి సంపాదించినదేలే (???) అంటూ వాళ్ల ఔదార్యాన్ని తీసి పడేశాం. ఏ మండపాల క్రింద ఏ నిధులు దాచారో అంటూ దొంగలు వాటిని తవ్వేసుకుని పోతే, ఆ మిగిలిన స్తంభాలను రాళ్లను కూడా ఇంకెవడో ఎత్తుకుపోయి అమ్ముకుంటే మనకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు.

విలాసవంతమైన మన బైకుల్లో కార్లల్లో బస్సుల్లో ఎంత దూరమైనా అలసట లేకుండా పోగలం కాబట్టి మనకు చెట్ల నీడ అవసరం లేదు.

మధ్యాహ్నాల పూట, రాత్రి వేళల్లోనూ కూడా మనం ఆగకుండా ప్రయాణం చేయగలం కాబట్టి సత్రాల అవసరం మండపాల అవసరం లేదు.

మనవి ఏసీ వాహనాలు కాబట్టి, అలసిపోవడానికి అవకాశమే లేదు, తినడానికి కూడా ఎక్కడా ఆగనవసరం లేదు, ఒక బాటిల్లో లీటరు నీరు పూర్తిగా అయిపోయే సమయానికి మనం మన ఊరికి చేరుకోగలం కాబట్టి దారిలో ఎన్ని బావులు పూడిపోయినా మనకేం నష్టం లేదు.

ఎందుకంటే మనం అతివేగవంతమైన తరానికి చెందినవారం అంటూ కాలర్లెగరేశాం.

చివరికి మన వేగం ఎంతవరకు వచ్చింది? ఈ రోజు వలస కార్మికులు తమ కుటుంబాలతో సహా సుదీర్ఘగమ్యాలకు నడుచుకుపోతూ ఉన్నపుడు దారుల వెంబడి చెట్లు, బావులు, సత్రాలు మండపాలు ఉండి ఉంటే వారు ఇంతటి శ్రమ పడేవారు కాదు కదా అన్న ఆలోచన ఎంతమందికి వచ్చింది?

మన చరిత్రను మనమే ఈసడించుకున్నాం. ఎవడు బడితే వాడు దానితో ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు మార్చివేస్తూ మన మహారాజులను బూజులంటే ఆహా ఓహో అన్నాం. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న మన పూర్వపు పరిపాలకులను కూడా పరిపాలన చేతగాదు అని, నిజానికి పరమకర్కోటకులైన విదేశీపాలకుల చరిత్రను కప్పిపుచ్చుతూ వారే లేకపోతే మన దేశానికి ఒక సాంస్కృతికమైన గుర్తింపు లేదు అని ఎవడో అంటే ′′చూశావా ఈ ఎవడోగాడొచ్చి చెప్పకపోతే మనకు నిజాలు ఎలా తెలిసేవి′′ అని నిట్టూర్చాం.

మన సంస్కృతిని మనమే చాదస్తం అంటూ అపహాస్యం చేసుకున్నాం. మన పూర్వికులలో ధనవంతులైనవారి ఔదార్యాన్ని మనమే ఎగతాళి చేసుకున్నాం. వారి ఘనకార్యాలను అబద్ధాలన్నాం. వారి గుర్తులన్నీ చెరిపివేయబడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాం.

పేదవారికి డబ్బులు పంచేది మాత్రమే సంక్షేమప్రభుత్వమని అభిమానులందరం జేజేలు కొడుతూ ఆయా ప్రభుత్వాలను నెత్తికెత్తుకున్నాం. అంతేగాని, ఆ పేదవారికి శాశ్వతలాభదాయకమైన పథకాలు ప్రవేశపెట్టరేం అని ఎన్నడూ మనం అడగనే అడగలేదు.

ఇలా మన పూర్వికులనుండి మనకు వారసత్వంగా రావలసిన క్రియాశీలత్వం, ఔదార్యం, సమయస్ఫూర్తి మొదలైన గుణాలన్నిటినీ పాక్షికంగా పోగొట్టుకుని, ఇప్పుడిదేదో హఠాత్తుగా వచ్చిపడిన సమస్య అన్నట్టు వలసకార్మికుల కష్టాలను చూసి కన్నీళ్లను కార్చేస్తూ ఎవరెవరికో శాపనార్థాలను పెడుతున్నాం.

అన్నిటికీ మూలకారణం మన అలసత్వమే. మన నిర్లక్ష్యమే. మన ఆత్మవిశ్వాసలోపమే. మన అవగాహనారాహిత్యమే. మన స్వార్థమే.

ఎవరెవర్నో తిట్టడం వలన లాభం లేదు.

కేవలం కూటికోసం వలసపోవలసిన అవసరం లేని పాలనను అందించగలిగిన ప్రణాళికలను వేసే ప్రభుత్వాలను మాత్రమే ఇకపై ఎన్నుకుందాం.

Previously posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2917517248368936

దృష్టికోణం


వేప చెట్టు గొప్పదే.

మనకెంతో ఉపయోగకరమైనదే.
అనేకపక్షులకు ఆశ్రయప్రదాతే.
కాని, ఇక్కడ చూడండి.

నా దృష్టికోణాన్ని బట్టి ఆ వేపచెట్టు, మేఘవేష్టనకమూ, అంబరచుంబీ అయిన ఆ మహాపర్వతం కంటే సమున్నతంగా కనిపిస్తోంది.

కనిపించిందా, లేదా?
కాబట్టి, వేపచెట్టు పర్వతం కంటె ఉన్నతమైనది అని నేనంటాను. మీరు ఒప్పుకొని తీరాలి. ఏం? ఎందుకు ఒప్పుకోరు?

***
ఏమయ్యా, నువు పర్వతాన్ని ఆ వేపచెట్టు క్రింద నుండి చూడడం బాగుంది కాని, నువున్న ఆ ప్రదేశాన్ని వదిలి, కాస్త ఇవతలికి వచ్చి చూస్తావా? ఉహూ అని తల అడ్డంగా ఆడిస్తావేం? ఎందుకు రావు?

నీ దృష్టికోణాన్ని మాత్రమే నువు పరిగణిస్తానంటే, మేము ఒప్పుకున్నా లేకపోయినా నువు పరిగణించేది మాత్రమే సత్యమంటే ఎలా?

నీ స్థానం నుండి నువు కదలనంటే, మరో కోణం నుండి చూడడానికి నువు నిరాకరిస్తే, నీకు సృష్టికర్త ప్రసాదించిన కన్నులనబడే సత్యాన్వేషకసాధనాలైన వనరులు బూడిదలో పోసిన పన్నీరే కదా!

అలసిపోయేంత దూరం నువు నడుస్తూ పోతే, అలా నడిచినంతసేపూ ఆ కొండ నీకు కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వేపచెట్లు దారిలో కొల్లలు కొల్లలుగా కనిపిస్తూనే ఉంటాయి. నీ మొదటి వేప చెట్టు ఎక్కడుందో నీకు అసలు కనబడకపోవచ్చును కూడా! అదీ ఆ కొండ ఔన్నత్యం.

ఉన్న కన్నులను కూడా ఆమాత్రం సద్వినియోగం చేసుకోకపోతే అంధగజన్యాయంలో ఆ అంధులు ఆ గజాన్ని తడిమి ఎవడికి వాడు తాను తెలుసుకున్నదే సంపూర్ణజ్ఞానమని భ్రమించినట్లు ఉంటుంది కదా!

అసలు ప్రపంచం Bidimensional స్థాయినుండి Tridimensional స్థాయికెదిగి చాలా కాలమైందే?

అలా కాదంటే చెప్పు,
ఆ వేపచెట్టు ఆ పర్వతం కంటే ఉన్నతమైనదని అప్పటికీ నువ్వంటూనే ఉంటే, నీ సిద్ధాంతం ప్రకారమే, ఆ వేపచెట్టు కంటె, ఆ పర్వతం కంటె కూడా నా అరచెయ్యి, నీ అరచెయ్యి రెండూ పెద్దవేనని ఒకే ఒక్క క్షణంలో ఋజువు చేస్తాను.

సరేనా?


 తొలిజామున చిరునవ్వుతో వికసించిన ఈ చిన్ని పూవు సొగసు చూడండి.


బహువర్ణరంజితమై విరాజిల్లే ఈ అద్భుతప్రపంచం పుట్టంధునికి కనబడదు, దాన్ని ఎంతగా వర్ణించి వర్ణించి చెప్పినా అతడికి అర్థం కాదు. అతడికి జలపాతపు హోరు వినిపిస్తుందే తప్ప జలపాతం కనిపించే అవకాశం లేదు.

సుమధురమైన వివిధసంగీతధ్వనులను, ప్రాకృతికశబ్దమాధుర్యాలను ఒక చెవిటి వాడు ఎంతమాత్రం వినలేడు. కోకిలను చూస్తాడు, నెమలిని కూడా చూస్తాడు, వాటి వర్ణాలను తప్ప వాటి గళాలను గ్రహించలేడు. కచేరీలో పాడుతున్న బాలమురళీకృష్ణకు, పని చెడగొట్టిన నౌకరును తిడుతున్న యజమానికి నడుమ పెద్ద తేడా లేదని అతనికి అనిపించవచ్చు. స్వరాలెన్నో తెలియని మనం కూడా శ్రుతిలయలను గ్రహించి ఆనందిస్తాం. ఆరోహణలను అవరోహణలను విని తన్మయులమవుతాం. వాటిని గూర్చి ఎంత చెప్పినా ఆ చెవిటివానికి అర్థం కాదు.

ప్రతి జ్ఞానానికి ఒక ఇంద్రియం సహకరించాలి.
వర్ణజ్ఞానానికి కన్నులు కావాలి. శబ్దజ్ఞానానికి చెవులు కావాలి. స్పర్శజ్ఞానానికి చర్మం కావాలి. రుచిని గ్రహించేందుకు నాలుక కావాలి. వాసనను తెలుసుకొనేందుకు ముక్కు కావాలి. ఇవన్నీ ఉంటే చాలదు. వీటన్నిటిని సమన్వయించేందుకు మనసు కావాలి. ఆ మనసు రోగగ్రస్తం కాకుండా, దారి తప్పకుండా మన స్వాధీనంలో ఉంటే భౌతికవిజ్ఞానమంతా మన సొత్తు కాగలదు.

నా భాష సులువని నాకు అనిపించేందుకు కారణం నా మనసు. లెక్కలు కష్టమని అనిపించేందుకు కారణం కూడా నా మనసే. అంత మాత్రాన భాష గొప్పదని, గణితం కొరకరాని కొయ్య అని నేను నిర్ణయిస్తే అది నా మూర్ఖత్వం.

మన జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, మనసుకు కూడా పరిమితమైన శక్తులు మాత్రమే ఉంటాయి. నా కండ్లు ఎంత బాగా చూడగలిగినా గోడ అవతల ఏముందో చూడలేవు. నేను ఎంత బలవంతుడినైనా కొండను ఎత్తలేను. నా కాళ్లు చేతులు ఎంత పొడుగైనా నేను సముద్రం ఈదలేను.

అంత మాత్రాన గోడకు ఇవతల కనిపించింది మాత్రమే సత్యమని, గోడ అవతల ఏమీ లేదని, నేను ఎత్తగలిగిన నా కంచమే ఉపయోగకరమైనదని, నేను ఎత్తలేని ఆ కొండ పనికి మాలినదని, నేను ఈదగలిగిన పంట కాలువ ప్రాణప్రదాయిని అని, నేను ఈదలేని ఈ సముద్రం నీరు పంటకు పనికిరాదని - ఇలా వాటిని నిందించడం మన అజ్ఞానానికి చిహ్నం. సంపూర్ణమైన అజ్ఞానానికి ఇవన్నీ గట్టి నిదర్శనాలు.

అలాగే, సైన్సు పేరిట మనకు అర్థమైంది కాబట్టి అది గొప్పదని, శాస్త్రం పేరిట ఉన్నది మనకు అర్థం కాలేదు కాబట్టి అది పనికిమాలినదని తీర్మానాలు చేయడం కూడా అజ్ఞానమే. పరిపూర్ణమైన అజ్ఞానమే. అజ్ఞానం అనే పదాన్ని మించి దాన్ని వర్ణించడానికి ఇంకో పదమేదైనా ఉంటే, అది కూడాను.

నేనెత్తగలిగిన కేజీ బరువును చీమ ఎత్తలేదు కాబట్టి, తేనెటీగ మోయలేదు కాబట్టి, చీమలను, తేనెటీగలను అల్పప్రాణులు అని నేను అనవచ్చు. కాని, అవి అదృశ్యమైన రోజుకు నేను అంతరించిపోయే రోజుకు పెద్ద దూరం ఉండదు.

నూరేండ్లు తదేకధ్యానంతో అధ్యయనం చేసినా ఒకే ఒక్క branch of science ను అవగాహన చేసుకొనడం కూడా ఒక మనిషికి సాధ్యం కాదు. కాని, ఆ మనిషి తాను సమస్తవిజ్ఞానాన్ని, సమస్త శాస్త్రాలను, ఔపోసన పట్టినట్లుగా, ఇదే గొప్పది, ఇదే పనికివచ్చేది, అది మాత్రం పనికిమాలినది అని పెదరాయుడిలా తీర్పులివ్వడం ఉంది చూశారూ? అది కూడా సంపూర్ణమైన అఖండమైన అజ్ఞానమని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను.

Previously posted at
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2390853931035273

Friday, 6 August 2021

ఆర్యులు - దస్యువులు

 


అత్యంతప్రాచీనకాలంలోనే ఆర్యులు తమ జీవనవిధానంలో సాధించిన ప్రగతిని, వారి విజ్ఞానవైభవాన్ని ప్రపంచమంతా గుర్తించింది, వేనోళ్ల కొనియాడింది.

అంతే! యూరోపియన్ సమాజం ఉలిక్కిపడింది. తాము కాలనీగా మార్చుకున్న దేశం సాంస్కృతికంగా తమకంటె గొప్పదని, అక్కడి ప్రజలు తమకంటె గొప్పదైన ఉదారమైన వైభవోపేతమైన అతిప్రాచీనమైన మహానాగరికతకు వారసులు అని ఒప్పుకునేందుకు వారికి ఏమాత్రం మనసొప్పలేదు.
అందువల్ల ఒక దొంగ చరిత్రను సృష్టించి ప్రపంచానికి బోధించడం మొదలు పెట్టారు. మధ్య-ఆసియాలో ఆర్యజాతి ఒకటి ఉండేదని, ఆ జాతికి చెందిన జనాలు తూర్పున ఉన్న భారతదేశానికి పోయి అక్కడ స్థానికులైన దస్యులను జయించి రాజ్యాలు స్థాపించారని, ఆ ఆర్యులే వేదాలు వ్రాశారని, భారతీయనాగరికత అంతా ఆర్యనాగరికత అని భారతీయుల గొప్పదనం అంటూ ఏమీ లేదని పాఠ్యపుస్తకాలలో చేర్చి పాఠాలు నేర్పుతూ, భారతీయులలో తరతరాలకు సరిపడా ఆత్మన్యూనతభావాన్ని కూరి కూరి పెట్టారు.
అందువల్లనే ఈనాటికి కూడా మనవాళ్లు ఆ విదేశీయుల విజ్ఞానం లేకుంటే మనం పశుప్రాయులుగా బ్రతికేవారమని భ్రమపడుతూ మనసులోనే వారికి పాదాక్రాంతులై, వారు మన దేశాన్ని వదిలి ఏనాడో వెళ్లిపోయినా, వారికి మానసబానిసలై జీవిస్తూ, వారు చెప్పిన మాటే వేదవాక్కని, వారిలాగ బ్రతకాలని, వారు ముద్ర వేస్తేనే ఏదైనా సత్యమౌతుందని, వారి భాష నేర్చుకుంటేనే తమ బ్రతుకు ధన్యమైపోతుందని, వారి నడత నేర్చుకుని వారిని అనుకరిస్తేనే తమ బ్రతుకు సార్థకమౌతుందని కలలు గంటూ ఇతరులను కూడా తమలాగే నమ్మింపజూడడం మనం గమనిస్తూనే ఉన్నాం.
కాని, మన గ్రంథాలను చదువుతూ ఉంటే ఆర్య అనే పదాన్ని మనవారు గుణవాచకంగా ఉపయోగించారనే విషయం స్పష్టంగా అవగాహనకు వస్తుంది.
శ్రీకృష్ణుడు కౌరవపాండవుల మధ్యలో సంధికోసం హస్తినాపురం వచ్చినపుడు పాండవుల తల్లి, తన మేనత్త అయిన కుంతీదేవి ఆశీస్సులు కోరి ఆమెను కలిశాడు. అపుడు కుంతీదేవి తన కోడలైన ద్రౌపదికి, తన కుమారులకు కౌరవుల వలన కలిగిన అవమానాలను, కష్టాలను, దుఃఖాలను స్మరించింది. దుర్యోధనాదులను అనార్యులని నిందించింది.
అంతే కాదు, ద్రౌపదీవస్త్రాపరహణం జరుగుతుండగా అక్కడ అవాక్కులై నిలిచిన ధృతరాష్ట్ర-బాహ్లిక-కృపృ-సోమదత్త-భీష్మ-ద్రోణాదులందరినీ ఆమె అనార్యబుద్ధితో నిలిచినవారుగానే పరిగణించేసింది. ఆ సభలో అందుకు అభ్యంతరం తెలిపిన విదురుడు ఒక్కడే ఆర్యుడని భావిస్తున్నానని చెప్పింది.
"వృత్తేన హి భవత్యార్యః, న ధనేన న విద్యయా"
(ఉద్యోగపర్వం 90.53)
"ఓ కృష్ణా, పెద్ద ఎత్తున ధనాన్ని (రాజ్యాన్ని, అధికారాన్ని కూడా) సంపాదించినంత మాత్రాన, లేదా గొప్ప గొప్ప శాస్త్రాలు చదివి మహా మేధావి అనిపించుకున్నంత మాత్రాన ఒక మనిషిని మనం ఆర్యుడు అని పిలువలేము. కేవలం శీలం (మంచి నడవడిక) చేతనే ఏ మనిషి అయినా ఆర్యశబ్దవాచ్యుడు కాగలడు"
అని కుంతీదేవి ఆర్యశబ్దనిర్వచనం చేసింది. కృష్ణుడు అవునంటూ ఆమోదముద్ర వేశాడు.
కాబట్టి, ఆర్య అనేది గుణాన్ని తెలిపే పదం. ఒక జాతిని గూర్చి చెప్పేది కానే కాదు.
అలాగే, వసిష్ఠస్మృతి కూడా ఆర్యపదాన్ని నిర్వచించింది.
కర్తవ్యమాచరన్ కామమ్, అకర్తవ్యమనాచరన్।
తిష్ఠతి ప్రకృతాచారే స వా ఆర్య ఇతి స్మృతః।।
ఏ మనిషి తనకు అప్పజెప్పిన కర్తవ్యాన్ని లేదా సమాజం చేత శాస్త్రాల చేత మంచివని అంగీకరించబడిన పనులను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడో, అలాగే ఆ సమాజం, ఆ శాస్త్రాల చేత చేయరానివని చెప్పబడిన పనుల జోలికి పోకుండా ఉంటాడో, తాను ఉన్న సమాజంలోని ఆచారాలకు కట్టుబడి ఉంటాడో అతడు ఆర్యుడు. (కామమ్ అనే పదానికి ఇక్కడ ఇష్టపూర్వకంగా, మనఃస్ఫూర్తిగా, చక్కగా, సంపూర్ణంగా అని అర్థం)
అంటే, సమాజానికి హితం కలిగించేవాడు, సమాజానికి ఎంత మాత్రం హాని కలిగించనివాడు, అనూచానంగా పరంపరగా వస్తున్న సదాచారాలను గౌరవించేవాడు ఆర్యుడు అని వసిష్ఠస్మృతి అభిప్రాయం.
ఈ నిర్వచనాల ప్రకారం ఆర్యశబ్దం ఒక జాతిని సూచించటం లేదని, కేవలం మనిషిలోని సద్గుణాలను మాత్రం సూచిస్తోందని తెలుస్తోంది.
ఆ ఆర్యులకు దస్యులకు యుద్ధం జరిగిన మాట వాస్తవమే. అయితే దస్యులు అంటే స్థానికులు అని అర్థం కాదు.
దస్యులు అంటే - దస్యంతి ఇతి దస్యవః - నాశనం చేసే స్వభావం కలవారు కాబట్టి వారిని దస్యులు అన్నారు.
అంటే పురాణకాలంలో మునుల యజ్ఞయాగాదులను ధ్వంసం చేసి, వారిని చంపివేసిన హిరణ్యకశిపుడు, రావణుడు వంటి వారు దస్యులు. అలాగే చరిత్రలో మన దేశం పైకి దండెత్తి, మన దేవాలయాలను కూలగొట్టి అపారమైన సంపదను దోచినవారు, మన గ్రంథాలయాలను తగులబెట్టినవారు, మన స్త్రీలను అపహరించినవారు వీరందరూ కూడా దస్యులే.
ఆ దస్యువులే అసురులు. దేవాసురులు ఒకే తండ్రి కన్నబిడ్డలన్న మాట నిజమే. కాని, మేము మాత్రమే ఉండాలి, మేము చెప్పినదే జరగాలి, మేము చెప్పినట్లే అందరూ నడచుకోవాలి, అని అందరినీ బెదిరించడం, అందుకు అంగీకరించకపోతే వారిని అన్ని విధాలుగా హింసించడం, సంహరించడం, తరిమివేయడం, వారి సంపదను స్వాధీనం చేసుకొనడం, ఇవన్నీ అసురుల పనులు.
ఈ దేవాసురసంగ్రామం భారతదేశంలో నిత్యం జరుగుతూనే ఉంది. నిన్న గాక మొన్న పాకిస్థానంలో గణపతిమందిరాన్ని వారు దగ్ధం చేసిన విషయం స్మరించండి.
కాబట్టి. భారతదేశంలో మొదటినుండి ఉన్నది ఆర్యులే. అనార్యులు మాత్రమే ఈ దేశం మీదకు దండెత్తి వచ్చారు. ఇక్కడి సదాచారాలను నాశనం చేశారు. చేస్తూనే ఉన్నారు. మరలా ఓ భయంకరమైన యుద్ధం అనివార్యంగా జరిగి తీరుతుంది. అజ్ఞానం కొద్దీ అటువంటి అనార్యబుద్ధులను మన అన్నదమ్ములలో కూడా కొందరు సమర్థిస్తున్నారు.
కాని, అనివార్యమైన కొత్త తరం దేవాసురయుద్ధం మొదలయ్యేసరికి ఏ పక్షంలో ఉండాలో వారు స్పష్టంగా ముందే తేల్చుకుంటే మంచిది. చివరకు గెలిచేది ధర్మమే గాని. బలం, ధనం కాదు. దుర్యోధనుడి 11 అక్షౌహిణీల సైన్యం ధర్మరాజు 7 అక్షౌహిణీల చేతిలో చిత్తైనాయి. శతాధికులైన కౌరవులు పంచపాండవుల చెేతిలో మన్ను గరచారు.
యతో ధర్మః తతో జయః।
ధర్మం ఏ పక్షాన ఉంటుందో ఆ పక్షమే గెలుస్తుంది.
ధర్మో రక్షతి రక్షితః।
ధర్మం ఎవరి చేత కాపాడబడుతుందో వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...