Wednesday 24 March 2021

బాఘ్ మార్ హరిసింగ్ నల్వా (4)


ఒకరోజు రాజా రంజిత్ సింగ్ నుండి హరిసింగ్ నల్వాకు ఒక రహస్య సందేశం వచ్చింది. “మన దేశంలోనికి శత్రువులు నిరంతరం కైబర్ కనుమగుండా చొరబడుతున్నారు. కాబట్టి కైబర్ కనుమ మన నియంత్రణలో ఉండాలి. వెంటనే అందుకు తగిన చర్య చేపట్టు.”
హరిసింగ్ నల్వా వెంటనే తన మంత్రులు సలహాదారులతో సమావేశమై కైబర్ కనుమను గూర్చి చర్చించాడు.
కైబర్ కనుమ హిమాలయపర్వతశ్రేణులలో భాగమైన హిందూకుష్ పర్వతాలలో ఉన్నది. ఆ ప్రాంతాలలో పష్తూన్ జాతికి చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. (నేడు ఆఫ్రిదీలుగా, యూసప్జాహిలుగా, పఠాన్లుగా పిలువబడుతున్నవారందరూ పష్తూన్లే.)
ఒకప్పుడు వారిలో అధికులు హిందువులుగా ఉండేవారు. మరికొందరు బౌద్ధులుగా, జొరాష్ట్రియనులుగా ఉండేవారు. పశుపాలనవృత్తి ద్వారా, అటవీసంపదను సేకరించి అమ్ముకొనడం ద్వారా, కొందరు కృషికర్మద్వారా ప్రశాంతజీవనం కొనసాగించేవారు.
భారతదేశంనుండి పడమటి దేశాలకు పోయేందుకు కైబర్ కనుమ దగ్గరి దారి. భారతదేశం నుండి, చైనా నుండి వ్యాపారులు కైబర్ కనుమ ద్వారా తమ వర్తకప్రయాణాలు కొనసాగించేవారు. (నేటి లెక్కలో అది యాబై కిలోమీటర్ల పొడవైన దారి.)
అయితే క్రమంగా అదే కనుమగుండా పశ్చిమదేశాలనుండి దోపిడీదారులైన తెగలు సౌభాగ్యవంతమైన భారతదేశంపై దాడికి రావడం ప్రారంభమైంది. అలెగ్జాండరు, తైమూరు, బాబరు మొదలైనవారందరూ కైబర్ కనుమనుండి అపారమైన సైన్యాలతో వచ్చి భారతదేశంమీద దాడి చేసినవారే. వారిలాగానే అనేకమైన నరహంతకులు లెక్కలేనన్ని సార్లు భారతదేశాన్ని దోచేందుకు వచ్చారు.
వచ్చిన ప్రతిసారీ వారు ఎన్నెన్నో అరాచకాలకు అకృత్యాలకు పాల్పడ్డారు. అపారమైన జనక్షయానికి కారకులైనారు. దేవాలయాలను కొల్లగొట్టి ధ్వంసం చేశారు. భారతీయుల గురుకులాలపైన విశ్వవిద్యాలయాలపైన దాడి చేసి, అక్కడ నిరపరాధులు, నిరాయుధులు అయిన ఆచార్యులను వారి శిష్యులను పాశవికంగా హతమార్చారు. గ్రంథాలయాలను గ్రామాలను తగులబెట్టారు. భారతీయులైన క్షత్రియులు ఒకవైపు యుద్ధరంగంలో ఉండగా, మరొకవైపు ఆయుధప్రయోగేతరవృత్తులలో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్న నిరపరాధులైన హిందువులపై భయంకరమారణాయుధాలతో దాడి చేసి పిల్లలు, వృద్ధులు అనే కనికరం లేకుండా పురుషులందరినీ హతమార్చారు. కంటికి సజీవంగా కనిపించిన స్త్రీలనందరినీ ఎత్తుకుపోయారు. భారతీయుల జీవనాధారమైన పశువులను కూడా వదలకుండా చంపేశారు. వారి వ్యవసాయక్షేత్రాలను సర్వనాశనం చేశారు. బావులలోను, చెఱువులలోనూ త్రాగే నీటిని విషమయం చేశారు.
అయితే ప్రతిసారీ భారతీయులు వారి దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు ఓడారు. మరికొన్ని సార్లు గెలిచి వారిని తరిమికొట్టారు. (ఈ కాలానికే చరిత్ర మధ్య యుగం అని పేరు. వారి క్రూరత్వానికి ఒక్క భారతదేశమే కాక ప్రపంచమంతా గగ్గోలెత్తిపోయింది. దానిని వారు తమ ఘనమైన వారసత్వచరిత్రగా ఈనాటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు.)
అయినప్పటికీ శతాబ్దాల తరబడి వేలాదిగా లక్షలాదిగా మిడతలదండులా వచ్చిపడిన ఎడారి సైన్యాలు క్రమంగా ఆఫ్ఘనిస్థాన్ పైన, కైబర్ కనుమ పైన పట్టును పెంచుకున్నాయి. ఒకప్పుడు గాంధారదేశంగా పిలువబడిన ఆఫ్ఘనిస్థాన్ లో స్థానికులైన హిందువులు బౌద్ధులు క్రమంగా అల్పసంఖ్యాకులైపోయారు. రంజిత్ సింగ్ కాలానికి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలముందే ఆఫ్షనిస్థాన్ బలవంతంగా ఇస్లాం దేశంగా మార్చబడింది. ఇస్లాం ధర్మం స్వీకరించేందుకు ఇష్టపడనివారు అమానుషంగా వధించబడ్డారు. భారతదేశం పడమటి భాగాన్ని ఆక్రమించుకున్నందున తమకు తోచినపుడు హఠాత్తుగా భారతదేశంపై దండెత్తడం ముసల్మాను రాజులకు సులువైంది.
ఇదే క్రమంలో వారు పష్తూన్ తెగవారిపై భీకరమైన దాడులు చేసి ఇస్లాం మతంలోనికి మార్చేశారు. వారి పష్తో భాషలో కూడా చాల మార్పులొచ్చాయి. వారి భాషలో భారతీయపదసంపద తగ్గిపోయింది. పర్షియన్ భాషాపదాలు వచ్చి చేరాయి. భాష మారితే సంస్కృతి మారిపోవడానికి ఎంతో కాలం పట్టదు. నెమ్మదిగా పష్తూన్ వారి ఆచారవ్యవహారాలు కూడా పూర్తిగా నాశనమైపోయాయి.
తరాలు గడుస్తున్న కొద్దీ పష్తూన్లు తమ పూర్వచరిత్రను మరచిపోయి, అచ్చమైన ముసల్మానులలాగానే ప్రవర్తించడం మొదలు పెట్టారు.
ఒకప్పుడు ప్రశాంతంగా బ్రతికిన వారు క్రూరస్వభావులైపోయారు. భారతదేశంపై నిష్కారణమైన ద్వేషం పెంచుకున్నారు. తాము పడమటి దేశాల వారసులమని, భారతదేశాన్ని దార్ అల్ ఇస్లాంగా మార్చాలని భావించడం మొదలు పెట్టారు. చీటికి మాటికి ఆఫ్ఘన్ సైన్యాలకు తోడుగా వారు భారతదేశంపై దాడులు చేస్తూ చీకాకు పెడుతున్నారు.
నౌషేరా యుద్ధంలో రాజా రంజిత్ సింగుకు వ్యతిరేకంగా అజీం ఖానుకు సహాయపడ్డారు. అలాగే హరిసింగ్ పెషావర్ ను స్వాధీనం చేసుకున్న సమయంలో దోస్త్ మహమ్మద్ ఖాను నిరపాయంగా తప్పించుకుని పారిపోయేందుకు కూడా సహాయపడ్డారు. ఆఫ్ఘన్ సైన్యాలు పక్కలో బల్లెమైతే ఈ పష్తూన్లు ఆ బల్లేనికి మొనలాంటివారు.
అందువలన భవిష్యత్తులో పడమటినుండి దండయాత్రలను ఆపాలంటే కైబర్ కనుమపై పట్టుసాధించడం అనివార్యం. అదీ రంజిత్ సింగ్ హరిసింగ్ నల్వాకు పంపిన ఆదేశంలోని ఆంతర్యం.
)))(((
హరిసింగ్ అమృతసర్ నగరంలో నవరాత్రి ఉత్సవాలలో పాల్లొనేందుకు వెళ్లాడని అందరూ అనుకున్నారు. అయితే అతడు తన కదలికలపై శత్రువుకు అంచనా వేసే అవకాశం ఇవ్వరాదనే వ్యూహంలో భాగంగానే వెళ్లాడు. నవరాత్రులు ముగియటమేమిటి, హరిసింగ్ నల్వా కైబర్ కనుమ దారిలో ముందుగా వచ్చే పష్తూన్ల స్థావరమైన జమ్రూద్ పై మెరుపుదాడి చేశాడు. (1836)
ఊహించని దెబ్బకు శత్రువులందరూ చెల్లాచెదురైపోయారు. కైబర్ కనుమగుండానే కాబూల్ కు పారిపోయారు. హరిసింగ్ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా జమ్రూద్ లో కోటను పటిష్టపరిచాడు.
దోస్త్ మహమ్మద్ ఖాన్ ఈ దెబ్బనుండి తేరుకునే లోగా హరిసింగ్ పంజతర్ మీద దాడిచేసి యుసఫ్జాహి సైన్యాన్ని ఓడించాడు. పంజతర్ పాలకుడైన ఫతే ఖాన్, రంజిత్ సింగ్ కు సామంతుగా ఉంటూ శిస్తు కట్టడానికి, హిందువులను హింసించకుండా ఉండటానికి అంగీకరించడంతో తిరిగి అతడికే పంజతర్ ను అప్పగించాడు.
ఇంతటి సంతోషకరమైన సందర్భంలో రాజా రంజిత్ సింగ్ మనుమడైన నవ నిహాల్ సింగ్ కు వివాహం నిశ్చయమైంది. (1837) మనం శత్రుత్వాన్ని వీడి మిత్రులుగా ఉందాం రమ్మంటూ దోస్త్ మహమ్మద్ ఖానుకు కూడా వివాహానికి రమ్మని రంజిత్ సింగ్ సందేశం పంపించాడు. వివాహానికి చాలమంది బ్రిటిష్ కమాండర్లు కూడా హాజరు కాబోతున్నారు.
రంజిత్ సింగ్ మాత్రమే కాక అతని సైన్యంలోని ప్రముఖసర్దార్లందరూ కూడా కూడా అమృత్ సర్ లో జరిగే వివాహానికి హాజరౌతున్నందు వలన, వారెవరూ లేని సమయంలో రాజధాని అయిన లాహోరుపై శత్రువులెవరూ దండెత్తకుండా, దండెత్తినా తగిన రక్షణకోసం యావత్ పంజాబ్ సామ్రాజ్యంనుంచి సైన్యంలో అధికభాగాన్ని లాహోరుకు రప్పించారు. వివాహానికి ఆహూతులైన అతి ముఖ్యమైన అతిథులకు అనుకోని ప్రమాదం వాటిల్లకుండా రక్షణ కల్పించాలనే సదుద్దేశంతో అమృత్ సర్ కు కూడా చాల సైన్యం వచ్చింది. అందులో భాగంగానే, పెషావర్ నుండి, జమ్రూద్ నుండి కూడా చాల సైన్యం లాహోర్ కు వెళ్లింది.
ఈ ఇంటిగుట్టు కమాల్ ఖాను ద్వారా దోస్త్ మహమ్మద్ ఖానుకు చేరింది. హరిసింగ్ నల్వాపై ప్రతికారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతడికి కాలం కలసి వచ్చినట్లనిపించింది. రాజకుమారుని వివాహానికి హరిసింగ్ అమృత్ సర్ కు పోతే నాయకుడు లేక తక్కువ సైన్యం కలిగిన జమ్రూద్ ను పెషావర్ ను తాను తిరిగి ఆక్రమించుకోవచ్చునని భావించి, తనకు ఆహ్వానం అందినప్పటికీ వివాహానికి అతడు హాజరు కాలేదు.
అమృత్ సర్ లో వివాహపు వేడుకలు ప్రారంభమయ్యే సమయానికి దోస్త్ మహమ్మద్ ఖాన్ జమ్రూద్ మీదకు తన కుమారులను, తన సర్దారులను పెద్ద సైన్యాన్ని తోడిచ్చి దండయాత్రకు పంపించాడు.
అప్పటికి హరిసింగ్ దళపతి అయిన మహాన్ సింగ్ కేవలం 600 మంది సిపాయిలతో జమ్రూద్ కోటను రక్షిస్తూ ఉన్నాడు. దాదాపు పాతికవేల మహమ్మద్ సైన్యం జమ్రూద్ కోటను చుట్టుముట్టి దిగ్బంధిచారనే విషయం హరిసింగ్ నల్వాకు తెలిసింది. అతడు నిజానికి అమృత్ సర్ వివాహానికి వెళ్లలేదు. పెషావర్ లోనే ఉన్నాడు. అతడు తత్క్షణమే హుటాహుటిన పెషావర్ నుండి కొద్దిపాటి సైన్యంతో జమ్రూద్ కు బయలుదేరాడు.
అతడు కవచం తొడుగుకుని యుద్ధసన్నద్ధుడై గుఱ్ఱం ఎక్కబోతున్న సమయానికి కమాల్ ఖాన్ చేతినిండా మిఠాయిలతోను, తన సేవకులతో పండ్ల బుట్టలతోను ఎదురు వచ్చాడు. హరిసింగ్ కు సలాం చేసి, హుజూర్, ఈ మిఠాయిలను స్వీకరించండి అన్నాడు.
అతడి సంతోషానికి హరిసింగ్ ఆశ్చర్యపోయి కారణం అడుగగా, “హుజూర్, మా నూర్ భానుకు కుమారుడు పుట్టాడు. అదే ఈ సంతోషానికి కారణం. మీరు ఈ మిఠాయిలు స్వీకరించండి. మా ఇంటికి విచ్చేసి (నిజానికి ఆ భవనం వారికి హరిసింగ్ ఇచ్చినదే) మీ చేతులతో నా మనుమడిని మీ అంతటి వాడు కావాలని దీవించండి” అని పలికాడు.
హరిసింగ్ సంతోషపడ్డాడు. కమాల్ ఖాను ఇచ్చిన మిఠాయిలను తీసుకున్నాడు. “కమాల్ సాబ్, నేను జరూరుగా జమ్రూద్ వెడుతున్నాను. తిరిగి వచ్చిన తరువాత తప్పక మీ ఇంటికి వస్తాను” అని చెప్పాడు. సరేనన్నాడు కమాల్ ఖాన్.
జమ్రూద్ చేరుకునే దారిలోనే హరిసింగ్ కు దోస్త్ మహమ్మద్ ఖాన్ సైనికులు ఎదురువచ్చి అడ్డగించారు. హరిసింగ్ చండప్రచండంగా విజృంభించాడు. అతడి ధాటికి ఆఫ్ఘన్ సైన్యం కకావికలైంది. చచ్చినవారు చావగా మిగిలినవారు పిక్కబలం చూపించసాగారు.
అయితే ఆ సమయంలో హరిసింగ్ కు కండ్లు తిరగటం మొదలుపెట్టాయి. తల దిమ్మెక్కిపోయింది. విపరీతమైన దాహం వేసింది మంచినీళ్లు అందుబాటులో లేవు. స్పృహతప్పి తన గుఱ్ఱం మీద వాలిపోయాడు.
ఇదంతా కమాల్ ఖాన్ హరిసింగ్ కు ఇచ్చిన మిఠాయిలలో కలిపిన విషప్రభావం!
హరిసింగ్ నీరసపడిపోవడం చూసిన శత్రువులు తిరిగి అతని చుట్టూ కమ్ముకున్నారు. ఒకడు తన బల్లెంతో హరిసింగ్ రొమ్ముపై బలంగా పొడిచాడు. మరొకడు డొక్కలో పొడిచాడు. నలుగురైదుగురు సైనికులు అతడి తలపై బలంగా ఆయుధప్రయోగం చేశారు. హరిసింగ్ గుఱ్ఱం ఒక్కసారిగా సకిలిస్తూ వెనుక కాళ్లమీద లేచింది.
దాంతో హరిసింగ్ తిరిగి స్పృహలోనికి వచ్చాడు. వెంటనే పరిస్థితిని గమనించాడు. వెంటనే భీషణపరాక్రమంతో విజృంభించాడు. అతడి కత్తికి సమాధానం చెప్పే ప్రతియోధుడు లేకపోయాడు. నిప్పులోనికి దూకుతున్న పురుగుల్లా అతడిని ఎదిరించబోయిన ప్రతి శత్రుసైనికుడూ అతడి ప్రతాపాగ్నిలో మాడిపోయాడు. అంతే కాదు, అతడి సైనికులు కూడా శత్రువులపై విజృంభించిన తీరు చూశాక అందులో ఒకొక్కడు ఒకొక్క హరిసింగ్ లా వారికి అనిపించాడు. దాంతో శత్రువులందరూ ప్రాణభయంతో మరలా పలాయనమంత్రం పఠించారు.
మొత్తానికి హరిసింగ్ జమ్రూద్ కోటకు చేరుకున్నాడు. అయితే అతడు తీవ్రంగా గాయపడిన విషయం దోస్త్ మహమ్మద్ ఖానుకు తెలిసిపోయింది. దాంతో చెల్లాచెదురైన తన సైన్యాన్ని తీసుకుని తానే స్వయంగా మరలా కోటను ముట్టడించాడు. లోపల సిక్ఖు సైనికుల సంఖ్య చాల తక్కువగా ఉందని అతడికి తెలుసు. అయినప్పటికీ, హరిసింగ్ నాయకత్వంలో ఒకొక్క సైనికుడూ పదేసిమంది శత్రువులను సులువుగా హతమార్చగలరని కూడా అతడికి తెలుసు. అందువల్ల యుధ్ధం చేయడానికి అతడికి ధైర్యం చాలలేదు. లోపల సైనికులకు ఎక్కువరోజులు సరిపోయేన్ని ఆహారపదార్థాలు లేవని, వారు తిండికి లేక నీరసించిపోతే కోటను పెద్దగా ప్రతిఘటన లేకుండానే స్వాధీనం చేసుకోవచ్చునని భావించి, కోటలోని వారు బయటకు రాకుండా కాపలా కాయడం మొదలుపెట్టాడు.
ఇటు హరిసింగ్ కు తనకు మరణఘడియలు సమీపించినట్లు తెలిసిపోయింది. అతడు మహాన్ సింగ్ ను పిలిచి, “నాయనా, నేను మరణించబోతున్నాను. నేను మరణించాను అనే విషయం తెలిస్తే మహమ్మద్ ఖాన్ తప్పకుండా కోటలోనికి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల నేను మరణించినా సరే, ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకు. అయితే త్వరలో జమ్రూద్ కు మన అదనపు బలాలు రానున్నాయి. అవి వచ్చి, మహమ్మద్ ఖానును తరిమికొట్టిన తరువాతనే నా మరణవార్తను మహారాజుగారికి నివేదించు. అంతవరకూ నా మరణసమాచారాన్ని మన శత్రువులకు గాని, మన ప్రజలకు గాని, చివరకు నా కుటుంబానికి గాని తెలియనివ్వకు” అని ఉపదేశించాడు.
మహాన్ సింగ్ సరేనని మాట ఇచ్చాడు.
మహమ్మద్ ఖాను దాదాపు వారం రోజుల పాటు కోట బయట ఎదురు చూశాడు. ఇంతలో రాజా రంజిత్ సింగ్ అదనపు బలగాలు అక్కడకు వచ్చి చేరడం చూడగానే తిరిగి సైన్యంతో సహా కాబూలుకు పారిపోయాడు. మరలా జమ్రూద్ ను, పెషావర్ ను స్వాధీనం చేసుకోవాలనేది అతడి జీవితంలో ఒక తీరని కోరికగానే మిగిలిపోయింది.
ఒక మహాయోధునిగా, గొప్ప ఔదార్యవంతునిగా, ప్రజలను ఎంతగానో ప్రేమించిన పరిపాలకునిగా, హరిసింగ్ నల్వా చరిత్రలో నిలిచిపోయాడు.
నమ్మకూడని వారిని నమ్మి వారిని చేరదీసి, చివరకు వారి ద్రోహానికి గురైన వారి జాబితాలో హరిసింగ్ నల్వా కూడా ఉండటం మన దురదృష్టం.
అతడు చేసిన పొరబాటునుండి మనం నేర్చుకొనవలసిన గొప్ప గుణపాఠం అది. నేర్చుకునేందుకు నిరాకరిస్తే అది మన జాతి కూడా చరిత్రలో కలిసిపోయి శాశ్వతంగా అదృశ్యమైపోతుంది. తథాపి, అమంగళం ప్రతిహతమగు గాక!
)))(((
ఇది కథలో నాల్గవ భాగం, చివరి భాగం.
)))(((
May be an image of outdoors and monument
M K Rama Raju and Satya Kumar
1 comment
6 shares
Like
Comment
Share

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...