Saturday, 19 February 2022

ఉత్తరదక్షిణాలుగా భారతవర్షం



ఉత్తరదక్షిణాలుగా భారతవర్షవిస్తీర్ణం మత్స్యపురాణంలో చెప్పబడింది.
"ఆయతస్తు కుమారీతో గంగాయాః ప్రవాహావధి"
(మత్స్య.114.10)
కుమారీతో = కుమారీతః = కన్యాకుమారి నుండి
గంగాయాః ప్రవాాహావధి = గంగాపరీవాహకప్రాంతం (Water basin) మొత్తం.
కన్యాకుమారి భారతదేశపు దక్షిణాగ్రంలో ఉందని మనకు స్పష్టంగా తెలుసు.
కాని, గంగ అంటే నేటి పాఠ్యపుస్తకాలు చెబుతున్నట్లు గంగోత్రిలో పుట్టి బంగాళాఖాతం వరకు ప్రవహించే పుణ్యనది ఒక్కటే కాదు.
గంగకు సప్తస్రోతస్సులు (ఏడు ప్రవాహాలు) ఉన్నాయి.
పరమశివుడు తన శిరస్సునుండి గంగను బిందుసరస్సు వైపు విడిచాడు.
(విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి - అని రామాయణవచనం ప్రమాణం. బాలకాండం, 43.11)
ప్రస్తుతం బిందుసరోవరం అనే పేరిట భారతదేశంలో చాల క్షేత్రాలలో దేవాలయపుష్కరిణులు ఉన్నాయి. కాని, అవేవీ రామాయణంలో చెప్పబడిన బిందుసరస్సు కావు. బిందుసరస్సు అంటే హిమాలయాలలోని మానససరోవరమే. లేదా నేడు మానససరోవరం ఉన్న అప్పటి ప్రాంతం బిందుసరస్సు అనే పేరింట వ్యవహరింపబడుతూ ఉండవచ్చు.
ఒక దేశం పేరిట ఒక జలాశయం ఉండటం, లేదా ఒక జలాశయం పేరిట ఒక దేశం ఉండటం ఈరోజున కూడా మనం గమనించగలం, బెంగాల్ పేరిట ఒక సముద్రాన్ని మనం బే ఆఫ్ బెంగాల్ గా వ్యవహరిస్తున్నాం. అరేబియా దేశం పేరిట అరేబియా సముద్రం ఉన్నది. భారతదేశం పేరిట Indian Ocean ఉన్నది. అలాగే బిందుసరోవరం ఉన్న విశాలభూభాగాన్ని ఆ రోజున బిందుసరోవరంగా వ్యవహరించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
అక్కడనుండి గంగ ఏడు పాయలుగా విడిపోయిందట.
తస్యాం విసృజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే (రా.బా.43.12)
బిందుసరస్సు ప్రాంతం నుండి తూర్పుదిశగా -
1 హ్లాదిని, 2 పావని, 3 నళిని
అనే మూడు పాయలు ప్రవహించాయి. (రా.బా.43.12)
{ఇవన్నీ ప్రాచీనమైన పేర్లు. ఇందులో ఒకదానిని మనం ఇపుడు బ్రహ్మపుత్రగా పిలుస్తున్నాం. మిగిలిన రెండూ నేటి సాల్వీన్ (Salween) మెకాంగ్ (Mekong) నదులు కావచ్చు.}

బిందుసరస్సు ప్రాంతం నుండి పడమటిదిశగా -
1 సుచక్షువు 2 సీత 3 సింధు
అనే మూడు పాయలు ప్రవహించాయి. (రా.బా.43.13-14)
{వీటిలో సింధునది ఇప్పటికీ అదే పేరుతో ప్రసిద్ధమే.}

సింధు పరీవాహకప్రాంతం

సింధునది - నేటి భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో


బిందుసరస్సు ప్రాంతం నుండి మొదట దక్షిణదిశగా, అక్కడనుండి మరలా తూర్పు దిశగా భాగీరథి పేరిట మరొక పాయ ప్రవహించింది. (రా.బా.43.14)

భాగీరథి


మొదట చెప్పినట్టుగా ఈ సప్త గంగా స్రోతస్సుల ప్రవాహావధి – (అంటే సమస్తపరీవాహకప్రాంతం) అంతా భారతవర్షమే. అంటే నేటి మానససరోవరప్రాంతం, అలాగే నేడు టిబెట్ అని పిలవబడుతున్న ప్రాంతం మొత్తం భారతవర్షమే. అలాగే టిబెట్ లో పుట్టిన సాల్వీన్ (Salween) నది ప్రవహిస్తున్న బర్మా, థాయిలండ్ ప్రాంతాలు, టిబెట్ లో పుట్టిన మెకాంగ్ (Mekong) ప్రవహిస్తున్న లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాల ప్రాంతాలు ఇవన్నీ ఒకనాడు భారతవర్షంగానే పిలువబడిందని భావించవచ్చు. ఈ నదులు ఆ ప్రాంతాలలో ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రవహించినట్లుగా కనబడినప్పటికీ, కన్యాకుమారి ప్రాంతం నుండి చూస్తే ఆ విశాలమైన పరిధిలో అవి తూర్పుకు ప్రవహించినట్లుగానే గోచరిస్తాయి. అవన్నీ చివరకు కలిసేది కన్యాకుమారికి తూర్పున ఉన్న సముద్రంలోనే.

బ్రహ్మపుత్ర పరీవాహకప్రాంతం


సాల్వీన్ పరీవాహకప్రాంతం


మెకాంగ్ పరీవాహకప్రాంతం

ఈనాటికి కూడా ఆ ప్రాంతాలలో రామాయణభారతాల కథలు ప్రచారంలో ఉండటం, అక్కడి రంగస్థలాలపై ఇప్పటికీ ఆ కథలు నాటకాల రూపంలోనూ నృత్యాల రూపంలోనూ ప్రదర్శింపబడుతూ ఉండటం, ఇప్పటికీ పురాణపురుషుల పేర్లను తమ సంతానానికి ఆక్కడి ప్రజలు పెట్టుకుంటూ ఉండటం, అతి ప్రాచీనమైన హిందూ దేవాలయాలు అక్కడ ఉండటం అందుకు సజీవసాక్ష్యాలుగా మనం పరిగణించవచ్చు.
ఇంతటి విశాలమైన ప్రాంతాన్ని అంతటి ప్రాచీనకాలంలోనే భారతవర్షమనే పేరిట వ్యవహరించారు. కాని కొందరు అజ్ఞానులు మాత్రం బ్రిటిషువాళ్లు వచ్చి కలిపేదాకా భారతదేశంలో సాంస్కృతికసమైక్యత లేదన్నట్లు మాట్లాడటం ఎంతటి తెలివితక్కువతనం!
మాఘకృష్ణచతుర్థీ, ప్లవః
శ్రీనివాసకృష్ణః

#Mekong 

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/4816802028440439


Tuesday, 4 January 2022

బుడంకాయ


 

బుడంకాయ అనే పేరు చాల ప్రసిద్ధం కదా.

అదే ఇది.
మేము బుడిమే కాయి అంటాము. మజ్జిగమిరపకాయల్లాగ మజ్జిగ బుడిమే కాయిలు చేసుకుని చారన్నంతో పాటు కొరుక్కుని తింటూ ఉంటే, (సొండిగలు లేదా వడియాలు లాగ) ఆహా, ఆ రుచే వేరు.
ఇంగ్లీషులో రకరకాల పేర్లు చెబుతున్నారు. కాని Citron Melon పేరిట కనబడిన చిత్రానికి, ఈ చిత్రంలో మీకు కనిపిస్తున్న దానికి చాల దగ్గరి పోలికలు ఉన్నాయి. https://en.wikipedia.org/wiki/Citron_melon
గ్లోవ్స్ గాని, ప్యాడ్స్ కాని వేసుకోకుండా మంచి జోరుగా క్రికెట్ ఆడుతూ ఫాస్ట్ బౌలర్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడబోతే, అది కాస్త బ్యాట్ కు తగలకుండా మన బొటనవ్రేలిని ముద్దాడితే ఆ సమయంలో బ్యాట్ హ్యాండిల్ కు గట్టి కార్క్ బంతికి నడుమ చితికిపోయిన ఆ బొటనవ్రేలు ఎంతగా పొంగిపోతుందో - ఆ పొంగంత పరిమాణంలో ఉంటుంది ఈ బుడిమే కాయి.

ఉష్ణకంటక లేదా కంటఫల

 


The Hindu (అక్టోబర్ 26, 2020) లో ఒక వార్త వచ్చింది.

ముంబై యూనివర్శిటీలో (ఎమ్మెస్సీ బోటనీ) చదువుతున్న ఒక విద్యార్థి సహ్యాద్రి పర్వతాలలో Echinops జాతికి చెందిన ఒక క్రొత్త రకం మొక్కను కనిపెట్టాడని, దానికి Echinops Sahyadricus అని పేరు పెట్టారని.
అరెరె. అదే మొక్కను నేను నిన్న మా చేని కంచెలో కనుగొన్నానే. Echinops Kalyanadurgicus అనే పేరు పెట్టే అవకాశం కోల్పోయాను కదా అనిపించింది.
కాని, తీరా చూస్తే Indian Medicinal Plants గూర్చి మంచి పరిశోధన చేసినవారందరూ ఇది భారత-ఉపఖండమంతటా సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులోపల తరచు కనిపిస్తూ ఉంటుందని స్పష్టం చేశారు.
)))ఉష్ణకంటక (కంటఫల)(((
మా చేని కంచెలో ఈ అందమైన పూల చెండు కనిపించింది. ఇదేమై ఉంటుంది అని వెతికితే దీనిని గురించి కొన్ని విశేషాలు తెలిశాయి. దానిని ఇంగ్లీషులో Echinops Echinatus అని, సంస్కృతంలో ఉష్ణకంటక లేదా కంటఫల అని అంటారట.
ఈ గుల్మానికి బాగా ముండ్లు ఉండటం వల్ల కంటకఅనే పేరు వచ్చినట్టుంది. ఎంతగా ఎండ ఉంటే అంతగా ఇది పెరుగుతుందట. అందువల్ల ఉష్ణ అనే పేరు తగిలించారు కావచ్చు. రెండూ కలసి ఉష్ణకంటక అనే పేరు పెట్టారేమో. (ఏమో – నా ఊహ మాత్రమే)
ఇంగ్లీషులో Indian Globe Thistle అని వ్యవహారం కూడా ఉందట. గుండ్రంగా ఉన్నది కాబట్టి Globe అని, ముండ్లతో కూడి ఉన్నది కాబట్టి Thistle అని అలా అంటారు కాబోలు.
కన్నడభాషలో బ్రహ్మదండి అంటారు అన్నారు కాని, ఇది బ్రహ్మదండి కాదు. ఇది, బ్రహ్మదండి సజాతీయమైనవి కావచ్చును. అంతవరకే.
ఇది నూరు సెంటీమీటర్ల ఎత్తు పెరిగే వార్షికపు మొక్క అన్నారు కాని, నేను చూసినది నాకంటె ఎత్తైన మొక్క.
ఇది డిసెంబరు - జనవరి మాసాలలో పుష్పిస్తుందట. అందువల్లనే జూలై నుండి నవంబరు వరకు ఎప్పుడూ ఇది నా కంటబడలేదు. డిసెంబరులో కూడా కనబడలేదు. చివరకు జనవరిలో మాత్రం నా కంటబడకుండా తప్పించుకోలేకపోయింది.
మన భారతీయఆయుర్వేదులు కనుగొన్న ప్రకారం, ఇది Anti flammatory అట. అంట కాలిన గాయాలను, వాపులను తగ్గించే గుణం కలిగినదన్నమాట. ఇది Tonic కూడా అట. అంటే బాగా ఆకలిని పుట్టించి తద్ద్వారా బలాన్ని కలిగించేదన్న మాట. ఇది Diuretic అట. అంటే మూత్రవర్ధకం, రక్తంలో నీరు చేరుకొంటే దానిని తొలగిస్తుంది. రక్తనాళాలలో ప్రవహించే ద్రవాన్ని తగ్గించి, తద్ద్వారా రక్తపు పోటును (BP) నివారిస్తుంది. Antipyretic అట. అంటే జ్వరనివారిణి. Analgesic అట. అంటే నొప్పులు తగ్గించేది. Aphrodisiac అట. అంటే ధాతువృద్ధిని కలుగజేసేది. ఇంకా, కాలేయాన్ని చురుకుగా పని చేయిస్తుందట. కీళ్ల నొప్పులను పోగొడుతుందట.
పొడిదగ్గుకు (Hoarse cough), అపస్మారానికి (Hysteria), అజీర్ణానికి (Dyspepsia,) గండమాల అనే కుష్టుకు (Scrofula), కండ్లకలకకు (Opthalmia), ఇది మంచి ఔషధం.
కేవలం కొమ్మలకు ఆకులకు మాత్రమే ఈ విధమైన ఔషధగుణాలు ఉన్నాయనుకోకండి, వీటి వేళ్లు కూడా వైద్యప్రయోజనాలు కలిగినవే అంటున్నారు. వీటి వేర్లను పొడి చేసి తలకు రాసుకుంటే పేలు తొలగిపోతాయట. రాజస్థానంలోని భిల్లులు వీటి వేర్లను నీటిలో వేసుకుని, దగ్గుకు జలుబుకు మందుగా త్రాగుతారట. గుజరాత్, భావనగర్ ప్రాంతపు జనాలు వీటి వేళ్లను పొడి చేసి, దానిలో నీటిచుక్కలు కలిపి, తేలుకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారట. అది నీటిలో కలుపుకుని త్రాగితే బేదులకు కూడా మంచి మందని ఆంధ్రప్రదేశ్ లోని కోలాములు కనిపెట్టారట. సంతానం లేని వారికి సంతానం కూడా కలిగిస్తుందని ఆయుర్వేదవైద్యులు అంటారట.
ఓహో, ఇంత గొప్ప మొక్క మా చేను కంచెలో సహజంగా ఆవిర్భవించడం చాల గొప్ప విషయం కదా? కాని, దాని గొప్పతనమేమిటో ఈరోజే నాకు తెలిసింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే సామెత నాలాంటి వారు ఉండటం వల్లనే పుట్టిందేమో.
ఈ క్రింది లింకులలో మరింత బాగా ఈ మొక్కను గూర్చి తెలుసుకోవచ్చును.
రైతులు ఇటువంటి పొదలు తీగలతో కూడిన సహజమైన కంచెలను అనాలోచితంగా, వేలం వెర్రిగా తొలగించి, కృత్రిమమైన ఇనుపతీగల కంచెలను వేసుకొనడమనే పనిని మానుకోవాలి.
రైతులతో పాటు జీవవైవిధ్యం వర్ధిల్లాలి.
పుష్యశుక్లద్వితీయా, ప్లవః

Sunday, 5 December 2021

దేశమంతా అర్జునులు ఉన్నారు. ఒకే ఒక్క కృష్ణుడు కావలెను.


 


1 అర్జునవిషాదయోగం

నాటి అర్జునుడి మానసికపరిస్థితిని చూస్తుంటే నేటి భారతీయుల మానసికపరిస్థితి గుర్తుకు వస్తోంది.

అవతలివాడి జోలికి పోకుండా తమ దారిన తాము బ్రతుకుదామనుకున్నప్పటికీ ఆ అవతలివాడు తమ ఉనికిని కూడా సహించలేకపోతున్నాడు అని తెలుసును.

బాల్యంలోనే తమ బలాన్ని (భీముడిని/ఐక్యతను) ఓర్వలేక, ఆ అవతలివాడు కపటంతో స్నేహం నటిస్తూనే విషం పెట్టి చంపజూశాడు అని తెలుసును.

తాము ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఉంటే సహించలేక ఆ అవతలివాడు రాజధానినుండి తమను వెళ్లగొట్టి వేరొకచోట తమను తమ తల్లితో సహా సజీవదహనం చేసేందుకు దారుణమైన ప్రయత్నం చేశారని తెలుసును.

తమ పౌరుషంతో దిగ్విజయం చేసి సార్వభౌములైనప్పటికీ ఏమాత్రం గర్వాన్ని ప్రదర్శించకుండా ఆ అవతలివాడిపై సహజమైన అతి సౌమ్యమైన సౌభ్రాతృత్వం కనబరచినప్పటికీ వాడు తమపై అసూయపడి, మయా ద్యూతంలో తమ సమస్తసంపదలను తమ రాజ్యాన్ని కాజేశారని తెలుసును.

సభలో అందరిముందూ తమ ధర్మపత్నిని ఆ అవతలివాడు విచక్షణారహితంగా అవమానం పాలు చేయాలని ప్రయత్నించిందీ తెలుసును.

ఆ అవతలివాడు తమను అడవులపాలు చేసింది చాలక తాము అడవిలో పడుతున్న అగచాట్లను కళ్లారా చూసి ఆనందించేందుకు, తమకు ఏమాత్రం అపరిచితం కాని వైభవాన్ని తమకే చూపి తమలో ఈర్ష్యను రాజేయాలనే ఉద్దేశంతో ఘోషయాత్ర పేరిట చేసిన దుస్సాహసం తెలుసును.

తాము అడవిలో ఉన్నప్పటికీ తమను వేలాదిమంది పండితవరేణ్యులు ఆశ్రయించి అండగా ఉండటం ఆ అవతలివాడు సహించలేక, తమను దూర్వాసమహర్షి శాపానికి గురిచేయాలని విఫలయత్నం చేసిన విషయం కూడా తెలుసును.

మహాసార్వభౌమపదవిని అలంకరించిన తమ పెద్దన్నతోబాటు, మహాసమ్రాజ్ఞిగా పదవీశోభితురాలై ఉండిన తమ ధర్మపత్నితో పాటుగా తమను అజ్ఞాతవాసంలోనికి నెట్టి, కఠినమైన సేవకవృత్తిని అవలంబించవలసి వలసి వచ్చేట్లు చేశాడని కూడా తెలుసును.

పరిస్థితులకు తలవొగ్గి, ఆ అవతలివాడు విధించిన సమస్తనియమాలను తు చ తప్పకుండా పాటించినా చివరకు ఆ అవతలివాడు తమ వంతు వచ్చేసరికి ఆ నియమాలను ఉల్లంఘించి తమకు తమ రాజ్యాన్ని అప్పగించకుండా సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వను పొమ్మన్నది కూడా తెలుసును.

తాము ఇపుడు యుద్ధానికి దిగినది తమ వంతు రాజ్యాన్ని సాధించుకునేేందుకేనని కూడా తెలుసును.

అయినా సరే,
అయినా సరే,

స్వయంగా మహావీరుడైనప్పటికీ, సమస్తకౌరవసైన్యాన్ని ఒక్క పాశుపతంతో క్షణకాలంలో భస్మీపటలం చేయగలిగిన మహాశక్తిమంతుడై ఉన్నప్పటికీ, తమను జీవితాంతం సంతోషంతో ఉండనివ్వకుండా దుఃఖసముద్రంలో ముంచదలచినవాడు, వీలైతే తమను సమూలంగా అంతం చేసేందుకు సర్వవిధప్రయత్నాలను అలుపెరగకుండా చేసిన ఆ అవతలివాడు ఎవడో కాదు, స్వయానా తమ సోదరుడే అని, అతడితో నేను యుద్ధం చేయడమా? వద్దు, యుద్ధం చేయను అని భావించడం ఆనాడు ఒక్క అర్జునుడికే చెల్లింది. అది అర్జునవిషాదం.

వీళ్లందరూ ఎవరు? నావాళ్లే కదా? నాతో కలసి ఇదే దేశంలో బ్రతుకుతున్నవాళ్లే కదా? వీరు నా పట్ల ఎంతటి శత్రుత్వం కనబరుస్తూ ఎన్ని విధాలుగా తమను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నా వీరిపట్ల నేను శత్రుత్వం వహించలేను అని భావించడం ఈనాడు కేవలం భారతీయులకే చెల్లింది. ఇది సమస్తభారతీయవిషాదం.

చివరకు అర్జునుడి విషాదం ఎంతవరకు వచ్చిందంటే,
"ఏతాన్న హన్తుమిచ్ఛామి
ఘ్నతోఽపి మధుసూదన" (గీత1.35)
"వీరి చేతిలో నేను చంపబడినా నాకు సమ్మతమే గాని, నేను మాత్రం వారిని చంపదలచుకోను" అనేంతవరకు వచ్చింది.

ఆ అవతలివాడు తమకు ఎన్ని అపకారాలు చేసినా, తమ పట్ల ఎన్ని అపరాధాలు పౌనఃపున్యంగా చేసినా, చివరకు పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని ప్రోగు చేసుకుని సమస్త ఆయుధాలు ధరించి, దయాదాక్షిణ్యాలు లేకుండా ఆ మరుసటి క్షణంలోనే తమను క్రూరాతిక్రూరంగా చంపడానికి సంసిద్ధంమై ఉరకలు వేస్తూ ఉన్నప్పటికీ, వారిని స్వజనం (నావారు) గా భావించి వారి పట్ల కనికరమే కనబరచడం అర్జునుడికే చెల్లింది.

స్వజనం హి కథం హత్వా
సుఖినః స్యామ మాధవ (గీత1.37)

"మనవారిని మనమే చంపుకుని మనం ఎలా సుఖంగా ఉండగలం కృష్ణా?" అని ప్రశ్నించాడు.

ఆ అవతలివారు కాశ్మీరంలోను, బెంగాల్లోను, కేరళలోను నరమేధం చేశారు. చేస్తున్నారు. అమాయికులైన పాల్ఘర్ సాధువులను తలలు పగులగొట్టి చంపేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేయాలని తమవారికి పిలుపునిస్తున్నారు. లవ్ జిహాద్ పేరిట తెగబడుతున్నారు. భైంసాను తగులబెట్టారు. పండుగలను, ఆచారాలను అవహేళను చేస్తున్నారు. ఆచారవంతులను మూర్ఖులని అవహేళన చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో అకృత్యాలు చేశారు. పదిహేను నిమిషాల్లో ముగించేస్తాం అని తమ ఉద్దేశాన్ని స్పష్టంగా బయటపెట్టుకున్నారు. అయినా వీరంతా నావారు అనుకొనడం ఈనాడు భారతీయులకే చెల్లింది.

కృష్ణా, వీరిని చంపడం మహాపాపం.
అహో బత మహత్పాపం (గీత1.45)

నేను ఏ మాత్రం స్పందించను. నేను ఆయుధం ధరించను. వారందరూ కత్తులు పట్టి నన్ను చంపినా సరే, అదే నాకు క్షేమం.
యది మామ్ అప్రతీకారమ్
అశస్త్రం శస్త్రపాణయః।
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్।। (గీత1.46)
అని భావించడం విషాదం కాక మరేమిటి?

అది విషాదం ఎందుకైంది?
విషమ్ అత్తి (విషమును తింటుంది) కాబట్టి విషాదమైంది. విషం తినడమంటే ఏమిటి? చావును కోరి తెచ్చుకోవడం అన్న మాట. ఆత్మహత్య అన్న మాట. అర్జునుడు ఆత్మహత్యకు పూనుకున్నట్టే లెక్క. అది అధర్మం.

ఎందువల్ల అధర్మం?
అర్జునుడు క్షత్రియుడు. ధర్మరక్షణకోసం, ప్రజారక్షణకోసం యుద్ధం చేయటం, అవసరమైతే యుద్ధంలో ప్రాణాలర్పించడం క్షత్రియధర్మం. తన ధర్మాన్ని వదిలి, నేను యుద్ధం చేయను అనడం అధర్మమే కదా.

ఇంతవరకు భగవద్గీతలో మొదటి అధ్యాయం.

అందువల్లనే కృష్ణుడు అర్జునుడి మానసిక పరిస్థితిని కశ్మలం అన్నాడు. క్లైబ్యం అన్నాడు. నీది క్షద్రమైన హృదయదౌర్బల్యం అన్నాడు. అనార్యజుష్టమన్నాడు. అస్వర్గ్యమన్నాడు. అకీర్తికరమన్నాడు. ఓ పెద్ద ప్రజ్ఞావాదాలు మాట్లాడుతున్నావే? అన్నాడు. (ఇది రెండవ అధ్యాయంలో - మరుసటి పోస్టులో చూద్దాం)

భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ (గీత 4 3) - "అర్జునా, నువు నా భక్తుడవు కాబట్టి, స్నేహితుడవు కాబట్టి, ఎంతో రహస్యమైన ఈ యోగాన్ని నేను నీకు చెబుతున్నాను" అంటూ వివరించడం మొదలుపెట్టాడు.

ఎంతో చర్చ జరిగిన పిమ్మట అర్జునుడికి మోహం తొలగిపోయింది. తన ధర్మం పట్ల చాల స్పష్టమైన అవగాహన కలిగింది. కృష్ణా, నేను నీ మాట వింటాను అంటూ ధర్మయుద్ధానికి సిద్ధమయ్యాడు. (ఇది పద్దెనిమిదవ అధ్యాయం చివర)

ఈ విధంగా విషాదం వదిలించుకున్నవారికే విజయం లభిస్తుంది. భగవద్గీతకు అటువంటి విషాదాన్ని వదిలించే శక్తి ఉన్నది. భగవంతుడై గీతను బోధించగల ఆచార్యుల అవసరం ఉన్నది. అందువల్ల భగవద్గీతాపఠనాన్ని అలవరచుకొమ్మని భారతీయులందరినీ ప్రోత్సహిద్ధాం. భగవద్గీతాసారాన్ని మరింతగా మన జీవితాలకు సమన్వయం చేసుకునేట్లు చేయగల జగద్గురువు కృష్ణుడు ఆచార్యుల రూపంలో అవతరించుగాక.

దేశమంతా అర్జునులు ఉన్నారు.
ఒకే ఒక్క కృష్ణుడు కావలెను.

~మార్గశీర్షశుక్లతృతీయా, ప్లవః~

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...