Saturday 12 September 2020

కుమారశతకం




పూర్వకాలంలో బడికి వెళ్లే పిల్లలకు మంచి ప్రవర్తనను నేర్పే కుమారశతకం ఇది.  ఎన్నో మంచి విషయాలను ఇది ప్రబోధిస్తుంది.  మచ్చుకు కొన్ని.

 

1 బడికి పొమ్మని ప్రబోధం

 

తెల తెల వారగ లేచియు

పలు దోమియు మురికి లేని పంచలతో నీ

పలకయు బలపము బుస్తక

ములు జేకొని బడికి జనుము ముద్దు కుమారా. (8)

 

2 కలిగిన దానిని ఆనందంగా స్వీకరించాలనే ప్రబోధం

 

కొఱ్ఱన్నమైన గానీ

గొఱ్ఱెల చల్లన్నమైన గాని కోపపడకమీ

కుఱ్ఱలతో జుఱుజుఱ్ఱని

జుఱ్ఖుకొనియు  లేచిపొమ్ము సొగసు కుమారా. (20)

 

సొమ్ములు సొగసులు గోరకు

కమ్మని పచ్చళ్లు గూరగాయలెపుడు తే

తెమ్మని మారము సేయక

తమ్ములతో గూడి చదువ దగును కుమారా. (23)

 

3 తోటి బాలురతో సఖ్యంగా ఉండాలనే ప్రబోధం

 

ఆట్లాడబోయి పెద్దలు

పోట్లాడగ జేయకయ్య బుద్ధి గలిగియే

తిట్లాడక బాలురతో

గొట్లాడక కూడి యాడుకొనుము కుమారా. (34)

 

4 ఓర్పు వహించాలనే ప్రబోధం

 

ఉడికియు నుడకని యన్నము

కడుపున దినబోకు నొప్పి గలుగును రుచిగా

నుడికిన యన్నము గూరలు

గుడుచుట సౌఖ్యంబు మంచి గుణము కుమారా. (63)

 

5 ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ప్రబోధం

 

చలికాలము నీ యింటను

గల బట్టలు గప్పికొనుము కాసేపయినన్

మొల బట్ట తోడ దిరుగకు

చలి బుట్టును జలుబు సేయ సాగు కుమారా.  (66)

 

నెల కొకనాడయినను నీ

తలకాయను నూనె చేత దట్టించుమురా

కలలెపుడు రావు నిద్దుర

గలుగును జదువుటకు దెలివి గలుగు కుమారా.  (88)

 

6 మేలు కోరి మంచిని చెప్పే పెద్దల మాటను వినమని ప్రబోధం

 

పెద్దలు వలదని చెప్పిన

దెద్దయినను జేయబోకు మెఱిగిన నిను గం

గెద్దని మొద్దని పిలుతురు

బుద్ధి కలిగి మంచిపనికి బొమ్ము కుమారా.  (70)

 

7 ఇతరులను హేళన చేయవద్దనే ప్రబోధం

 

రోగుల బిచ్చి బికారుల

జోగుల జంగముల పిల్ల జట్టులవారిన్

మూగల ముక్కిడివారిని

నాగడంపు బల్కు బల్కకయ్య కుమారా.  (75)

 

8 స్త్రీల పట్ల మర్యాద కలిగియుండాలనే ప్రబోధం

 

అసె వసె యని యాడంగుల

పసితనమున బిలువబోకు పరువు తొలగురా

పసివాడవనుచు జూడరు

గసరుచు కొట్టిదరు చెంపకాయ కుమారా.  (77)

 

9 జాగ్రత్తగా సంచరించాలనే ప్రబోధం

 

కాలికి జెప్పులు దొడుగక

కాలవకును బోకు మచట గల ముండులు నీ

కాలిని విరుగును జీకటి

కాలములో దేలు పాము కరచు కుమారా.  (80)

 

10 దురభ్యాసాలకు దూరంగా ఉండుమనే ప్రబోధం

 

పొగ చుట్టలు బీడీలును

సిగరెట్టులు త్రాగబోకు చిన్నతనమయా

పొగ చేతను రొమ్మెండును

సొగసగు నీ పెదవి నలుపు సోకు కుమారా.  (89)

 

చీట్లాటలు నేర్చికొనకుము

పోట్లాటలు వచ్చు జదువు పోవును పాడై

తిట్లాట లేని చదువుల

పోట్లాటలు నేర్చికొనగ పొమ్ము కుమారా.  (92)

నవ్వులకైన నబద్ధం

బవ్వలతోనైన నెప్పుడాడకు గీడౌ

ని వ్వసుదలోన తంగెడు

పువ్వయినను దొంగిలంగబోకు కుమారా.  (99)

 

11 దొంగతనము కూడని పని అని ప్రబోధం

 

బడిలోని బలపమైనను

గుడి లోపలి తులసి తోటకూరాకైనన్

దడి కందిపుల్లలైనను

తడబడకను దొంగిలించ దగదు కుమారా. (93)

 

 

ఇందులో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పబడ్డాయి.  అయితే అందులో కొన్ని ఈ రోజుకు అతిగా అనిపిస్తాయి.  పిల్లల మీద అతి నియంత్రణ కూడదనిపించేలా ఉంటాయి.  అయితే అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి మాటలు యథాలాపంగా అంటూ వుంటాం.  అయితే పిల్లల భద్రత కోరి చెప్పిన మాటలే అవన్నీ.  వాటిని పిల్లల సాహసకృత్యాలను నిషేధించడంగా వారి బాల్యపు ఉత్సాహాన్ని అణచివేయడంగా భావించకూడదు. మచ్చుకు కొన్ని.

 

బావులను దొంగి చూడకు

మావుల దొడ్లోకి బోయి యాటాడకుమీ

త్రోవను నెగురుచు బోవకు

మావల మోసంబు వచ్చు నయ్య కుమారా.  (29)

 

ఎండల  వానలలోపల

కొండల వాగులకు జెరువు కోనేళ్లకు బో

కుండుము కాల్జారిన నొ

క్కండయినను లేవదియ్య గలడె కుమారా.  (32)

 

అయ్యలు వలదని చెప్పిన

గొయ్యలు వ్రేలాడు చెట్టు గొమ్మలతోనే

యుయ్యాలలూగ బ్రోకుము

చెయ్యో కాలో విరుగంజేయు కుమారా.  (71) 

 

ఇంకా,

ఇతరుల యెంగిలి యన్నము

గతుకంగా బోకు వారిగల రోగము నీ

కతుకును మూతికి గావున

సతతము బండైన జీక జనదు కుమారా (16)

 

అని ఆరోగ్యపరంగా చేసిన నాటి ప్రబోధాన్ని నేటి అత్యాధునిక సోషలిస్టులు పిల్లల నడుమ పంచుకుని తినడమనే సద్గుణాన్ని నిషేధించడంగా నిందిస్తూ రచ్చ చేసి ఈ పుస్తకాన్ని నిషేధించాలన్నా నేను ఆశ్చర్యపోను.

 

చంద్రునిలో చిన్న చిన్న మచ్చలున్నంత మాత్రాన చందమామను ఇష్టపడని వారుంటారా?  అలాగే ఈ కుమారశతకము కూడా.  కుండినసీమలో ఫిరంగిపురవాసి అయిన కరణం బొల్లయ్యామాత్యుని కొడుకునైన చిల్కా వేంకటకృష్ణుడనే పేరు కలిగిన నేను ఈ కుమారశతకాన్ని వ్రాశాను అని రచయిత చెప్పుకున్నాడు.  గుంటూరు నరసరావు పేటల మధ్యలో ఉండే ఫిరంగిపురమే అయ్యుండవచ్చు.  ఆ ప్రాంతాన్ని పూర్వం కుండినసీమ అనే పేరుతో పిలిచేవారా?  తెలుగు నేలలో ఫిరంగిపురమనే ఊరు ఇంకెక్కడైనా ఉన్నట్టు నాకు తెలియదు.  మరొకటి ఉంటే చెప్పగలరు. క్రీస్తుశకం 20వ శతాబ్దంలో శార్వరీనామసంవత్సరంలో ఈ కుమారశతకం వ్రాయబడిందని రచయిత స్వయంగా తెలియజేశాడు.  ఇప్పుడు (2020-21) నడుస్తున్నది కూడా శార్వరీనామ  సంవత్సరమే.  అంటే  ఇప్పటికి 60 యేండ్ల ముందుగాని, 120 యేండ్ల ముందుగాని ఇది వ్రాయబడి ఉండాలి.  అంటే 1960-61 ప్రాంతంలో కాని, 1900-01 ప్రాంతంలోగాని ఇది వ్రాయబడి ఉండాలి.  కాని, 1934 నాటికే ఇది తెలుగుప్రాంతపు పాఠశాల పిల్లలకు ఒక అప్రూవ్డ్ పాఠ్యపుస్తకంగా ఉన్నది.  అంటే, ఇది 1900-01 సంవత్సరాలలో వ్రాయబడింది అని చెప్పవచ్చు.  (ఇరువదవశతాదిని – అనే పదం రచయిత ఉపయోగించాడు.)

 

వికీపీడియాలో కుమారశతకాన్ని గూర్చి వేరే విధమైన వివరాలు ఉన్నాయి.  కుమారశతకం సంస్కృతంలో భాస్కరరావు చేత వ్రాయబడిందని, దేవులపల్లి సుబ్బరాయశాస్త్రిచేత తెనిగింపబడిందని వ్రాసుకొచ్చారు.  మచ్చు తునకలు అంటూ అందులో రెండు పద్యాలు కూడా ఇచ్చారు.  అవి నేను చెప్పిన కుమారశతకంలో లేవు. ఈ కారణాల వల్ల, వికీపీడియాలో వ్రాయబడ్డ కుమారశతకం వేరు, నేను పేర్కొన్నటువంటి కుమారశతకం వేరు అని స్పష్టంగా చెప్పవచ్చు.

 

ఈ రెండూ కాకుండా గుంటూరు జిల్లా సాతులూరు గ్రామవాసి అయిన మునగపాటి చినహనుమయ్య చేత రచింపబడి, 1925లో ముద్రింపబడిన కుమారశతకం మరొకటి ఉన్నది.  ఇది తెలుగులో వ్రాయబడినప్పటికీ, ఇందులో సంస్కృతశబ్దావళి ఎక్కువగా ఉన్నది.

 

ఈ మూడూ కాకుండా, ప్రక్కి కులోద్భవుడైన అప్పల నరసింహుని చేత 1860, రౌద్రినామసంవత్సరంలో వ్రాయబడి, భాగవతుల దక్షిణాముర్తిగారిచేత టీకాతాత్పర్యాలు వ్రాయబడి, యం.యస్ శర్మ అండ్ కో (గుంటూరు-తెనాలి) వారి చేత  1935లో ముద్రింపబడిన కుమారశతకం వేరొకటున్నది.  ఇందులో కూడా సంస్కృతశబ్దగుంఫనం ఎక్కువే.

 

మరి, ఈ విధంగా నాలుగు కుమారశతకాలుండగా చిల్కా వేంకటకృష్ణుడు వ్రాసినదే పాఠశాల పిల్లలకు అప్రూవ్డ్ కాబడిందని ఎలా చెప్పావు అని అడుగుతారా?   ఖచ్చితంగా ఆ నాలుగింటిలో ఇదే అప్రూవుడు అని నేను చెప్పలేను గాని, ఇందులో పసి బిడ్డల కోసం, పెద్దగా చదువుకోని పెద్దలకోసం నేను తేలికైన తెలుగును వాడాను, అందువల్ల సభలలోగాని, బాగా చదువుకున్నవారు గాని, తేలికగా తీసిపారవేయవద్దు అని వేంకటకృష్ణుడు చెప్పిన మాటలు నచ్చాయి. 

చదివిన పెద్దలు సభవా

రిది తేలిక తెలుగటంచు నెంచగవలదీ

చదివెడి పసిబిడ్డలకును

జదువని పెద్దలకు దెలియు సరళి కుమారా.  (4)

 

సామాన్యబాలురకోసం వ్రాయబడినా, అతడు వారిని రాజకుమారా అని సంబోధించడం ఇంకా బాగా నచ్చింది.  అటువంటి వేంకటకృష్ణుని పట్ల నాది పూర్తిగా పక్షపాతం.  100% నిజం.  అందువల్ల, నేను ఇప్పుడు విద్యాశాఖామంత్రినై యుంటే గనుక, ఈ వేంకటకృష్ణుని శతకాన్నే ఒకటవ తరగతి నుండి పిల్లలకు కంఠస్థం చేయించాలని ఆదేశాలు జారీచేసి ఉండేవాడిని. 

 

సరే, తిరుపతికి వచ్చినపుడు గోవిందరాజస్వామి గుడిదగ్గర గాని, శ్రీకాళహస్తీశ్వరుని గుడికి దక్షిణగోపురం దగ్గర గాని కనిపించే చిన్న పుస్తకాల అంగళ్లలో ఈ కుమారశతకాలు దొరికే అవకాశాలు ఉన్నాయి.  ప్రయత్నించండి.  నేను కొన్న వేంకటకృష్ణుని పుస్తకం శ్రీకాళహస్తిలో దొరికింది.

 

ఏదేమైనా, అన్నిటికంటె ఇందులో నాకు నచ్చిన ప్రబోధం మాత్రం ఈ క్రిందిది.  ఇదుగో ఆ పద్యం.

 

అదలించిన బెదరించిన

పద పద యని నిన్ను క్రింద బడ ద్రోసిన నీ

వదరక బెదరక నిజమును

వదలకురా నీకు మేలు వచ్చు గుమారా.  (97)

 

నేటి పరిస్థితులలో భారతీయులు ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అలవరచుకొనవలసిన సద్గుణం ఇది.  ఈ ప్రబోధాన్ని మనసుకెక్కించుకుని ఆ విధంగా ప్రవర్తించగలిగితేనే భారతీయులు మనుగడను కొనసాగిస్తారు.  లేదా  అంతరించిపోవలసిందే. 

 

ఇది కుమారశతకం కాబట్టి, బాలురకే ఎక్కువ ప్రబోధం జరిగింది.  బాలికలకు ప్రత్యేకంగా వేంకటనరసింహకవీంద్రుడు వ్రాసిన కుమారీశతకం వేరే ఉన్నది.  దానిలో విషయాలను మరెప్పుడైనా చూద్దాం.

 

 


No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...