వ్యాక్స్ వామ్స్ అని పిలువబడే ఈ పురుగులు ప్లాస్టిక్ను తినేస్తాయి అని,
దానిని ఒక ఉపయోగకరమైన రసాయనపదార్థంగా మార్చేస్తాయి అని అంటున్నారు.
ప్లాస్టిక్ త్వరగా నశించేది కాదని, మన ఇల్లైన భూగోళంపై భూమ్మీద,
నీటిలోనూ గాలిలోనూ కూడా శతాబ్దాల తరబడి నిలిచిపోతుందని, అది పర్యావరణాన్ని దెబ్బ తీస్తుందని, మనుషులు, ఇతరజంతుజాలం దాని వలన క్రమంగా
నశిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతూ వస్తున్నారు. 
అయినప్పటికీ, వర్తమానమే తప్ప భవిష్యత్తు పట్ల బాధ్యత లేని మనుషులు ఆ మాటలను
ఎంత మాత్రం పట్టించుకోకుండా ప్లాస్టిక్ ను వాడుతూనే ఉన్నారు.  అందువల్ల ప్లాస్టిక్ ను నిషేధించడమే సరైన చర్య
అని ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రపంచమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి.  
అయితే ప్లాస్టిక్ వ్యాపారులు మాత్రం ఇటువంటి ప్రచారాలు ఆందోళనలు తమ
వ్యాపారాన్ని దెబ్బతీయడానికి మాత్రమే జరుగుతున్నాయని పోటీగా ఎదురు ప్రచారం చేస్తున్నారు.  ప్లాస్టిక్ సంచుల బదులు కాగితం సంచులు వాడితే
వాటి కోసం చెట్లను పెద్ద ఎత్తున నరకవలసి ఉంటుందని, దానివల్ల మాత్రం పర్యావరణం
దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నారు. 
ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా గాజును వాడితే ఆ గాజు కూడా పర్యావరణంలో అంత
త్వరగా కలిసిపోయేది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు.  ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా రకరకాలో లోహాలను
వాడితే వాటిని భూమినుండి బయటకు తీసుకురావడం కోసం గనులు తొలచవలసి ఉంటుందని, దానివలన
పర్యావరణ హాని కలుగదా అని ప్రశ్నిస్తున్నారు. 
ఇప్పుడు క్రొత్తగా ఈ వ్యాక్స్ వామ్స్ అనేవి ప్లాస్టిక్ ని తింటాయని, ప్లాస్టిక్ వ్యర్థాలను అవి అదుపుచేయగలవని, అందువలన ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం కూడదని, మిగిలిన పదార్థాలలాగానే ప్లాస్టిక్ ను కూడా స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా ఇకమీదట ఉత్పత్తి చేయవచ్చునని వారు వాదిస్తున్నారు.
అసలు ఏమిటి ఈ వ్యాక్స్ వామ్స్?
ఇది చిమ్మట (moth) జాతికి చెందినది.  దీని జీవితచక్రం సీతాకోకచిలుక లాగానే, గుడ్డు
- లార్వా - కకూన్ - రెక్కల పురుగు అనే దశలలో గడుస్తుంది.  
వీటిని మనం మైనం తినే పురుగులు అని వ్యవహరించవచ్చు.  తేనెటీగలు తన గూడును మైనంతో నిర్మించుకుంటాయి.  ఆ మైనం కూడా పాలిమర్ అని ప్లాస్టిక్ తరగతికి
చెందినది.   ఈ వ్యాక్స్ వామ్స్ అని పిలువబడుతున్న పురుగులు ఆ మైనాన్ని తిని
బ్రతుకుతాయి.  
అందువల్ల ఆ పురుగులు ప్లాస్టిక్ ను కూడా తినగలవా అని కోణంలో కొన్ని పరిశోధనలు
జరిగాయి.  
ఫ్రెడరిక్ ఆ బెట్రోచ్చిని
అనే శాస్త్రజ్ఞురాలి
నాయకత్వంలో ఈ విధమైన పరిశోధనలు జరిగాయి.  ఆమె
స్పెయిన్ దేశస్థురాలు.  యూనివర్సిటీ ఆఫ్
కాంటబ్రియాలో జీవశాస్త్రజ్ఞురాలు.  
అయితే ఈ పరిశోధనకు బీజభూతమైన సంఘటన ప్రయత్నపూర్వకంగా కాకుండా, ఆకస్మికంగా
జరిగింది.  ఆమె తన తోటలో తేనె వ్యవసాయం
చేస్తుంది.  ఒకసారి ఆమె తోటలోని తేనెగూడులలో
ఉన్న కొన్ని మైనం పురుగులను తీసి ఒక ప్లాస్టిక్ సంచి మీద పెట్టడం జరిగింది.  ఒక గంట తరువాత చూస్తే ఆ ప్లాస్టిక్ సంచులకు
రంధ్రాలు ఉన్నాయట.  
మనమైతే ఎందుకలా రంధ్రాలు పడ్డాయి అనే విషయాన్ని పెద్దగా
పట్టించుకోము.  ఎందువల్లనంటే మన దృష్టిలో
ప్లాస్టిక్ ఒక వ్యర్థపదార్థం.  దానిని
వాడుకోవడం పూర్తి అయిన తర్వాత దానిని మనం ఒక చెత్త బుట్టలో నిర్లక్ష్యంగా విసిరేస్తాం.  అంతే. 
దానికి రంధ్రాలు పడినా, పడకపోయినా మనకు అనవసరం.  అసలు దానిని మనం పట్టించుకోం.  మన దృష్టి అంతవరకే.  
అయితే బెట్రోచ్చిని జీవశాస్త్రజ్ఞురాలు.  ఆమెది పరిశోధనాదృష్టి.  హఠాత్తుగా ప్లాస్టిక్ కు ఎందువల్ల కన్నాలు
పడ్డాయి అనే కోణంలో ఆమె ఆలోచన చేసింది. 
మైనం పురుగు లార్వా ప్లాస్టిక్ ను తినడం వల్ల ఈ విధమైన రంధ్రాలు ఏర్పడ్డాయి
అని ఆమె తెలుసుకున్నది.  ఆమె ఆనందానికి
అవధులు లేకుండా పోయాయి.  ప్లాస్టిక్ ను
తినే పురుగులు ఉన్నాయి అని ఆమె ఆ విధంగా కనుగొన్నది.
అప్పుడు ఆమె తన తోటి శాస్త్రజ్ఞులు అయిన బొంబెల్లి, క్రిస్టఫర్ హొయెలతో కలసి మరింత
జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించడం మొదలు పెట్టింది.  
వారు నూరు మైనం పురుగులను వారు ఒక పాలితిన్ ప్లాస్టిక్ బ్యాగు మీద
వదిలిపెట్టారు.  తెల్లవారేలోగా ఆ పురుగులన్నీ
కలసి 92 మిల్లీగ్రాముల ప్లాస్టిక్ ను తినేశాయి.  పరిశోధన మరింత ముందుకు సాగింది.
కేవలం బ్రతికి ఉన్న పురుగులు మాత్రమే ప్లాస్టిక్ ను తినడం ద్వారా
ప్లాస్టిక్ ను నాశనం చేయగలవా లేక ఆ పురుగుల శరీరగతకణాలు కూడా ప్లాస్టిక్ ను నాశనం
చేయగలవా అనే కోణంలో కూడా వారు పరిశోధనలు చేశారు. 
వారి పరిశోధన విజయవంతమైంది. 
చనిపోయిన పురుగుల అవశేషాలను కూడా ప్లాస్టిక్ మీద ఉంచితే ఆ ప్లాస్టిక్
నశిస్తుంది అని వారు తెలుసుకున్నారు.  కాలుష్యంతో
కునారిల్లిపోతున్న ప్రపంచానికి ఇది ఎంతో శుభవార్త.  
ఆ మైనం పురుగులలోని ఎంజైములు ప్లాస్టిక్ పదార్థమైన polyethylene ను ethylene glycol అనే రసాయనపదార్థంగా మారుస్తున్నాయి అట.  ఆ రసాయనపదార్థాన్ని ఒక వస్తువు గడ్డకట్టకుండా
వాడుతుంటారు.    (హిమాలయాలలో ఉండే మన సైనికులకు
ఈ రసాయన పదార్థం చక్కగా ఉపయోగపడుతుంది కదా?)
ఆ ఎంజైములు ఏమిటో, వాటి
స్వభావం ఎటువంటిదో తెలుసుకుంటే ఆ ఎంజైములు కేవలం మైనం పురుగులలో మాత్రమే లభిస్తాయా
లేక ఇతరత్రా కూడా లభిస్తాయా అనే విషయం అర్థం చేసుకోవచ్చు.  తద్వారా వాటిని తగిన మొత్తంలో ఉత్పత్తి చేయడం
ద్వారా త్వరగా పర్యావరణంలో కలిసిపోయే విధంగా ప్లాస్టిక్ ను తయారు చేయవచ్చు అని
ఆశిస్తున్నారు. 
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు కూడా వేరొక రకమయిన
బ్యాక్టీరియా  ethylene terepthalate  అనే ప్లాస్టిక్ ను నాశనం చేయగలవని కనుగొన్నారట. 
ఈ విధంగా ప్లాస్టిక్ ను నాశనం చేయగలిగిన అటువంటి పురుగులు కీటకాలు
మనకు తెలియనివి ఇంకా చాలా ఉండవచ్చునని, ఇంకా చాలా పరిశోధనలు జరగవలసి ఉంది అని
శాస్త్రజ్ఞులు అంటున్నారు. 
అయితే ఒక పదార్థం నాశనం కావడం అనేది నిజానికి జరగదు.  అది వేరొక పదార్థంగా మార్చబడుతుంది.  అంతే.  అందువలన,
ప్లాస్టిక్ నాశనమై వేరొక పదార్థంగా మారినప్పుడు అది మానవాళికి, అనేక జీవరాసులతో
కూడిన పర్యావరణానికి ఎంతవరకు హాని కలగకుండా ఉంటుంది అనే దానిని బట్టి ఈ పరిశోధనలు
ముందుకు సాగుతాయి.   మనకు ఒక పరిష్కారమార్గాన్ని సూచిస్తాయి.  ఆయా బ్యాక్టీరియా ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్
కంటే మరింత ప్రమాదకరమైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తే మనం పెనం నుంచి పొయ్యిలోకి
పడ్డట్టే.  అటువంటప్పుడు ఆ పరిశోధనలు ఇక
ముందుకు సాగవు.  పైపెచ్చు ఆ బ్యాక్టీరియా
ప్లాస్టిక్ జోలికి పోకుండా కాపాడుకోవలసిన ఎటువంటి బాధ్యత కూడా మన మీదే
ఉంటుంది.  
అంతే కాదు, ఈ మైనం పురుగులు ప్లాస్టిక్ ను నాశనం చేస్తాయి
ఆ విధంగా మనకు ఉపకారం చేస్తాయి అనే దృష్టితో మనం ఈ పురుగులను ఇబ్బడి ముబ్బడిగా
ఉత్పత్తి చేయడానికి పూనుకుంటే, కాలక్రమేణ
అవి ప్రపంచంలో ఉండే ప్లాస్టిక్ మొత్తాన్ని తినేసి సంఖ్యాపరంగా చివరకు మనుషులకు
ప్రమాదాన్ని కలిగించే స్థాయికి చేరుకుంటాయి అని భయం కూడా కలగవచ్చు.  
అయితే ఆ భయం అవసరం లేదు. ఎందువల్లనంటే ఈ పురుగులకు లెక్కలేనన్ని పక్షులు సహజశత్రువులు. (అంటే రకరకాల పక్షులకు ఇవి సహజమైన ఆహారం.) ఈ పురుగులను చేపలు పట్టే గేలానికి ఎరగా వాడుతూ ఉంటారు. పైగా ఇవి మంచి ప్రోటీన్లు కలిగి ఉంటాయట. అందువల్ల కొన్ని దేశాలలో వీటిని వేయించి బొరుగులు తిన్నట్టు తింటూ ఉంటారట.
ప్రస్తుతం ప్రపంచంలో సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థంగా భూమిని ఆక్రమించుకుంటూ
ఉంది.  8 మిలియన్ టన్నుల వ్యర్థమైన ప్లాస్టిక్
సముద్రాలలో కలుస్తూ ఉంది.  
మనం తినే తిండిలోను, మనం పీల్చేగాలిలోను కూడా మైక్రో ప్లాస్టిక్స్
ఉన్నాయని, అవి క్రమక్రమంగా మన శరీరంలో ప్రవేశిస్తున్నాయని శాస్త్రజ్ఞులు
హెచ్చరిస్తున్నారు.  అందువలన మనుషులలో
పునరుత్పత్తిసామర్థ్యం తగ్గిపోతుందని, స్థూలకాయం పెరిగిపోతుందని, గుండె జబ్బులు
అధికమవుతాయని, పిల్లల్లో ఎదుగుదల సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు.
అందువల్ల, ప్లాస్టిక్ ను నాశనం చేసే ఇటువంటి మైనం పురుగులు, వాటిలో
ఉండే ఎంజైములు, అటువంటి బ్యాక్టీరియా మనిషికి మిత్రులు.  మనం మిత్రులను కాపాడితే ఆ మిత్రులు మనలను కాపాడగలవు.
ధర్మో రక్షతి రక్షితః.

 
